నోర్మూసుకోమన్నారు.. డేవిడ్ను టీమ్ నుంచి తప్పించాలని చూశారు : వార్నర్ భార్య ఆగ్రహం
David Warner: 2018లో సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తో పాటు మరో ఆటగాడు బాల్ టాంపరింగ్ కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారిపై ఏడాది నిషేధం విధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో క్రికెట్ ఆస్ట్రేలియాపై దుమ్మెత్తిపోసింది. బాల్ టాంపరింగ్ (దక్షిణాఫ్రికాతో టెస్టులో) వివాదంలో ఇరుక్కుని ఏడాదిపాటు నిషేధానికి గురైన వార్నర్ను టీమ్ నుంచి శాశ్వతంగా తప్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా కుట్ర పన్నిందని ఆరోపించింది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01gw4f7vk3v684c8566rab6fdj/gettyimages-1249053003_300x200xt.jpg)
మాటీ జాన్స్ పోడ్కాస్ట్ లో క్యాండీస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. క్యాండీస్ మాట్లాడుతూ.. ‘సౌతాఫ్రికాలో మేం హోటల్ రూమ్ నుంచి బయటకు రాగానే డేవిడ్ ను టీమ్ నుంచి శాశ్వతంగా తప్పించేందుకు కుట్ర జరిగింది. మాకు ఎవరి దగ్గరి నుంచి సపోర్ట్ లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఏ ఒక్కరూ మాకు మద్దతుగా రాలేదు.
అప్పటికే మానసికంగా కుంగిపోయి ఉన్న మాకు సాయం చేయడానికి ఎవరూ రాకపోవడంతో డేవిడ్ కుంగిపోయాడు. సాయం చేయకపోగా డేవిడ్ ను మళ్లీ టీమ్ లోకి రాకుండా చేయగలిగిందంతా చేశారు. ప్రతీదానికి మమ్మల్ని నిందించారు.
నా దగ్గరి బంధువులు ఈ విషయంలో మాకు మద్దతుగా నిలిచారు. ఆసీస్ క్రికెట్ బోర్డు మాపై కక్ష సాధింపుతో మమ్మల్ని ఏం మాట్లాడకుండా నోరు మూసుకోమంది. జట్టు ప్రయోజనాల నిమిత్తం మేం కూడా కామ్ గా ఉండిపోయాం. టీమ్ పై మాకు గౌరవం ఉంది. కానీ మేం కూడా మానవమాత్రులమే కదా..
వార్నర్ ను తొలగించగానే మరో ఆటగాడిని తీసుకున్నారు. కానీ వార్నర్ మళ్లీ తన ఫామ్ అందుకుని టీమ్ లోకి వచ్చాడు. జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్ డొనాల్డ్ (ఆసీస్ హెడ్ కోచ్) వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. వాళ్లు వార్నర్ కు అండగా ఉంటున్నారు. కానీ బాల్ టాంపరింగ్ వచ్చిన సమయంలో మాత్రం మేం నరకం చూశాం..’అని చెప్పింది.
2018లో సౌతాఫ్రికాతో టెస్టు సందర్భంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తో పాటు మరో ఆటగాడు బాల్ టాంపరింగ్ కు పాల్పడటంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారిపై ఏడాది నిషేధం విధించింది. స్మిత్, వార్నర్ పై కెప్టెన్సీ నిషేధం కూడా వేసింది. కానీ రెండేండ్ల క్రితమే స్మిత్ పై ఈ నిషేధం ఎత్తేసింది. అంతేగాక అతడిని టెస్టులకు కమిన్స్ కు డిప్యూటీగా నియమించింది. భారత్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో స్మిత్ సారథిగా కూడా వ్యవహరించాడు.
గతేడాది వార్నర్ పై కూడా కెప్టెన్సీ నిషేధం తొలిగిపోయింది. అయితే ఆరోన్ ఫించ్ వన్డే, టీ20 కెప్టెన్సీ వదిలేశాక ఆ ఫార్మాట్లకు కూడా పాట్ కమిన్స్ నే కొనసాగిస్తోంది. ఇక కెప్టెన్సీ గురించి వార్నర్ మరిచిపోయినట్టేగానీ.. త్వరలో ఇంగ్లాండ్ వేదికగా జరుగబోయే యాషెస్ సిరీస్ లో కూడా వార్నర్ రాణించకుంటే అతడి టెస్టు కెరీర్ కు మంగళం పాడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.