క్రికెటర్ భువనేశ్వర్ కుమార్కి కరోనా లక్షణాలు... భార్యతో కలిసి ఐసోలేషన్లో భువీ?
భారత స్టార్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కరోనా బారిన పడినట్టు సమాచారం. భువీ, ఆయన భార్య నుపూర్ నగర్కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ ఇద్దరూ ఐసోలేషన్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే భారత క్రికెటర్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.
భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్, మే 21న క్యాన్సర్తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్, అతని భార్య నుపూర్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్లోకి వెళ్లినట్టు సమాచారం.
అంత్యక్రియాల్లో పాల్గొన్న వారిలో ఎవరికైనా కరోనా ఉండి ఉండవచ్చని ఈ జంట భావిస్తోంది. అయితే ఇంకా వైద్య పరీక్షల రిజల్ట్స్ రాలేదు.
భారత జట్టు తరుపున 21 టెస్టులు ఆడిన భువనేశ్వర్ కుమార్, 63 వికెట్లు పడగొట్టాడు. 2014 ఇంగ్లాండ్ టూర్లో మూడు హాఫ్ సెంచరీలతో పాటు రెండుసార్లు ఐదేసీ వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నాడు భువనేశ్వర్ కుమార్.
ఇంగ్లాండ్లో మంచి రికార్డు ఉన్నప్పటికీ భువనేశ్వర్ కుమార్కి, ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. భువనేశ్వర్ కుమార్ స్వచ్ఛంధంగా టెస్టు ఫార్మాట్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే తాను ఎప్పుడూ మూడు ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశం వచ్చినా రాకపోయినా టెస్టుల్లో కూడా రాణించగల సత్తా తనలో ఇంకా ఉందని స్పష్టం చేశాడు భువనేశ్వర్ కుమార్.
వచ్చే నెల శ్రీలంకలో పర్యటించే భారత బీ జట్టులో భువనేశ్వర్ కుమార్ కీలకంగా మారే అవకాశం ఉంది. నటరాజన్, నవ్దీప్ సైనీలతో పాటు దీపక్ చాహార్, భువీలకు ఈ టూర్లో అవకాశం దక్కొచ్చు.