ట్రిపుల్ సెంచరీ కూడా చేసేవాడిని.. కానీ : ఇషాన్ కిషన్ కామెంట్స్
Ishan Kishan: మూడో వన్డేలో ఇషాన్ కిషన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. అయితే ఈ మ్యాచ్ లో తాను ట్రిపుల్ సెంచరీ కూడా సాధించేవాడినని చెబుతున్నాడు ఈ యువ ఓపెనర్. తాను దూకుడుగా ఆడుతుంటే కోహ్లీ శాంతపరిచాడని తెలిపాడు.

బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కిషన్.. 131 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో ఇషాన్.. 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్.. విరాట్ కోహ్లీతో కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్.. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల సరసన నిలిచాడు.
మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్ తో దూకుడు చూపించిన ఇషాన్.. తాను ట్రిపుల్ సెంచరీ కూడా సాధించేవాడినని అన్నాడు. భారత ఇన్నింగ్స్ ముగిశాక ఇషాన్ మాట్లాడుతూ.. తాను మరికొంతసేపు గనక క్రీజులో ఉంటే ట్రిపుల్ సెంచరీ పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు. కోహ్లీతో బ్యాటింగ్ చేయడం గురించీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్నది. నేను బ్యాటింగ్ కు వెళ్లగానే అనుకున్నది ఒక్కటే. బంతి బాదడానికి అనువుగా ఉంటే బాదేయడమే. అందులో మరో ఆలోచనే లేదు. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా నా పేరు దిగ్గజాల సరసన ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నా.
నేను ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసి ఉంటే ట్రిపుల్ సెంచరీ కూడా సాధించేవాడినేమో. విరాట్ భయ్యాతో బ్యాటింగ్ చేయడం బాగుంటుంది. అతడు నన్ను శాంతపరిచాడు. నేను 90లలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడుతుంటే నా దగ్గరికి వచ్చి ముందు సింగిల్స్ తీయి అని చెప్పాడు. నేను దానినే ఫాలో అయ్యాను. వాస్తవానికి నేను సిక్సర్ తో సెంచరీ చేద్దామనుకున్నా.
సూర్య భాయ్ (సూర్యకుమార్ యాదవ్) తో కూడా చాట్ చేశాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను ఒత్తిడి తీసుకోదలుచుకోలేదు. నాకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా..’ అని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేశాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 44వ శతకం. మొత్తంగా 72వది. తద్వారా కోహ్లీ సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటిగ్ ను అధిగమించి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. కోహ్లీ, ఇషాన్ ల మెరుపులతో మూడో వన్డేలో టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.