సారథిగా పుజారా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముందు కీలక టోర్నీ..
WTC Finals: వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ వేదికగానే భారత్.. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పుజారా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

భారత జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లలో సుమారు 95 శాతం మంది ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మునిగి తేలుతున్నారు. కీలక ఆటగాళ్లంతా తమ ఫ్రాంచైజీ ఆటగాళ్లతో ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్ లు ఉంటే ప్రాక్టీస్, ఆట లేకుంటే పార్టీలంటూ వేరే ప్రపంచంలో తేలియాడుతున్నారు.
ఆడేందుకు ఛాన్స్ రాని ఆటగాళ్లు మాత్రం.. డగౌట్ లలో బిస్కెట్లు తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ గడుపుతున్నారు. అయితే వీరందరికీ భిన్నంగా ఛటేశ్వర్ పుజారా మాత్రం కీలక టోర్నీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో అతడికి మంచి అవకాశం కూడా దక్కింది.
భారత్ టెస్టు మ్యాచ్ లు ఆడని వేళలో ఇంగ్లాండ్ లో కౌంటీలు ఆడే పుజారా ప్రస్తుతం యూకేలో ఉన్నాడు. కౌంటీలలో సస్సెక్స్ కు ప్రాతినిథ్యం వహించే పుజారాకు ఆ టీమ్ మరో బంపరాఫర్ ఇచ్చింది. ఈ సీజన్ లో సస్సెక్స్ టీమ్ కు పుజారా సారథిగా వ్యవహరించుతున్నాడు.
ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్షిప్ - 2023లో భాగంగా డివిజన్ - 2లో సస్సెక్స్ కు సారథిగా ఉండబోతున్నానని పుజారా తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ టామ్ హెయిన్స్ గత సీజన్ లో గాయపడటంతో అప్పుడు కొన్ని మ్యాచ్ లకు తాత్కాలిక సారథిగా ఉన్న పుజారా.. ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ గా ఉంటున్నాడు.
కౌంటీలో సస్సెక్స్ ప్రయాణం నేటి (ఏప్రిల్ 6) నుంచే మొదలుకానుంది. సస్సెక్స్ నేడు డర్హమ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలాఉండగా పుజారాకు ఇంగ్లాండ్ కౌంటీలలో ఇది వరుసగా రెండో సీజన్. 2022లో కూడా అతడు సస్సెక్స్ తరఫున ఆడుతూ.. 13 ఇన్నింగ్స్ లలో 1.094 రన్స్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.
కాగా వచ్చే జూన్ లో ఇంగ్లాండ్ వేదికగానే భారత్.. ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు అలవాటు కావడానికి పుజారాకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు పుజారా చాలా కీలకమైన బ్యాటర్. ప్రస్తుతం భారత జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయపడటం.. పంత్ కూడా తప్పుకోవడంతో పుజారా మీద అదనపు భారం పడనుంది.