ప్రపంచకప్లో బుమ్రా లేకపోవడం పెద్ద లోటు.. అతడి రిప్లేస్మెంట్పై ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah: త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు తరఫున ఎంపికైన బుమ్రా.. తర్వాత వెన్నునొప్పి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. దీంతో బుమ్రా లేకుండానే భారత్ వరల్డ్ కప్ వేట కొనసాగించనుంది.
టీ20 ప్రపంచకప్ కు ముందు భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి తిరగబెట్టడంతో మెగా టోర్నీకి దూరమయ్యాడు. అయితే అతడు లేని లోటు పూడ్చలేనిదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. సౌతాఫ్రికాతో ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టీ20 తర్వాత ద్రావిడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ద్రావిడ్ స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ లో బుమ్రా లేకపోవడం మాకు పెద్ద నష్టం. అతడు గొప్ప ఆటగాడు. జట్టులో బుమ్రా వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతాం. బుమ్రా గాయపడటంతో జట్టులోకి మరో ఆటగాడు వచ్చే అవకాశం దొరికింది...’అని అన్నాడు.
మరి బుమ్రా స్థానంంలో షమీ రాబోతున్నాడా..? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘బుమ్రా స్థానాన్ని ఎవరు రిప్లేస్ చేస్తారనే విషయంపై ఓ క్లారిటీకి రావడానికి మాకు అక్టోబర్ 15వరకు సమయముంది. ఇప్పటికే షమీ స్టాండ్ బైలో ఉన్నాడు. అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్ లో ఎంపికైనప్పటికీ ఆడలేకపోయాడు.
ప్రస్తుతం షమీ ఎన్సీఏలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం గురించి మేం నివేదికలు తెప్పించుకుంటున్నాం. నివేదికలు వచ్చాక సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ కలిసి నిర్ణయం తీసుకుంటుంది. షమీ మంచి క్రికెట్ ఆడాలని మేం కోరుకుంటున్నాం..’ అని చెప్పాడు.
డెత్ ఓవర్లలో భారత బౌలింగ్ విఫలం కావడం గురించి మాట్లాడుతూ.. ‘అవును. ఇది మేం తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అంశం. అయితే మేం ఇక్కడ ఆడుతున్నవన్నీ ప్లాట్ పిచ్ లు. మేం మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
మ్యాచ్ చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎవరికైనా సవాలే.. నాణ్యమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి జట్లు కూడా చివరి పవర్ ప్లే లో విఫలమవుతున్నాయి. అయితే ఈ విషయంలో మేం లోపాలను సరిదిద్దుకుంటున్నాం..’ అని చెప్పాడు.
చివరగా హర్షల్ పటేల్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. రెండు నెలల తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన బౌలర్ కుదురుకోవడానికి సమయం పడుతుందని, త్వరలోనే అతడు తన మునపటి ఫామ్ ను అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రెండేండ్లుగా హర్షల్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడని.. అతడి ఫామ్ గురించి ఆందోళన లేదని తెలిపాడు.