ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జైట్లీ విగ్రహం... బిషన్ సింగ్ బేడీ ఆగ్రహం, డీడీసీఏ నుంచి బయటికి...
ఢిల్లీలోని ప్రఖ్యాత ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ మైదానంలో దివంగత నేత అరుణ్ జైట్లీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుంది ఢిల్లీ మరియు డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ). ఈ నిర్ణయంతో ఏకీభవించని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ... తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కోట్లా మైదానంలో ఉన్న స్పెక్టేటర్స్ స్టాండ్కు తన పేరును తొలగించాలని డిమాండ్ చేశాడు.
2017లో ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని ప్రేక్షకుల స్టాండ్కి బిషన్ సింగ్ బేడీని పేరును పెట్టిందది డీడీసీఏ.
అయితే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో నెపోటిజం పెరిగిపోతుందని ఆరోపించిన బిషన్ సింగ్ బేడీ... ‘క్రికెటర్ల కంటే అడ్మినిస్టేటర్లకే అధిక ప్రాధాన్యం దక్కుతోందని’ ఆరోపించారు.
డీడీసీఏ ప్రెసిడెంట్గా ఉన్న రోహన్ జైట్లీ, తన తండ్రి, దివంగత రాజకీయ నాయకుడైన అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకోవడమే ఈ వివాదానికి కారణం.
‘చాలా ఏళ్లు నేను ఎంతో సహిస్తూ వచ్చాను. కానీ నేను దేని గురించైతే భయపడ్డానో ఇప్పుడు అదే జరిగింది. డీడీసీఏ నా సహనాన్ని పరీక్షించింది. ఈ నిర్ణయం తీసుకునేలా ఉసిగొల్పింది...’ అంటూ తన లేఖలో పేర్కొన్నాడు బిషన్ సింగ్ బేడీ.
డీడీసీఏకి 1999 నుంచి 2013 దాకా 14 ఏళ్లు ప్రెసిడెంట్గా వ్యవహారించిన అరుణ్ జైట్లీ ఆరు అడుగుల విగ్రహాన్ని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్.
అయితే ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఓ స్టాండ్కి 2017 నవంబర్లో బిషన్ సింగ్ బేడీ పేరును, మరో మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్నాథ్ పేరును పెట్టారు డీడీసీఏ అధికారులు.
క్రికెటర్ల పేర్లను స్టాండ్స్కి పెట్టి, ఓ రాజకీయ నాయకుడు, డీడీసీఏ మాజీ ప్రెసిడెంట్ విగ్రహాన్ని స్టేడియంలో పెట్టడం ప్లేయర్లను అవమానించినట్టే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు బిషన్ సింగ్ బేడీ...
అరుణ్ జైట్లీ వర్కింగ్ స్టైల్ తనకెప్పుడూ నచ్చేది కాదని, కొందరు వ్యక్తులతో ఆయన సఖ్యతగా ఉండి, నచ్చనట్టు వ్యవహారించేవారని చెప్పుకొచ్చాడు బిషన్ సింగ్ బేడీ.
‘లార్డ్స్లో వీజీ గ్రేస్, ఓవల్లో జాక్ హోబ్స్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సర్ డొనాల్డ్ బ్రాడ్మన్, బార్బోడాస్లో సర్ గ్రాఫిల్డ్ సోబర్స్... మెల్బోర్న్లో షేన్ వార్న్... ఇలా క్రికెట్ మైదానాల్లో క్రికెటర్లకే చోటు ఇవ్వాలి. అంతేకాని రాజకీయ నాయకులకు, ఫెయిల్ అయిన అడ్మినిస్టేటర్లకు కాదు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బిషన్ సింగ్ బేడీ.