- Home
- Sports
- Cricket
- రెండో టెస్టుకి ముందు శ్రీలంకకు ఊహించని షాక్... ఫామ్లో ఉన్న ఆ ఒక్క బ్యాట్స్మెన్ కూడా...
రెండో టెస్టుకి ముందు శ్రీలంకకు ఊహించని షాక్... ఫామ్లో ఉన్న ఆ ఒక్క బ్యాట్స్మెన్ కూడా...
భారత పర్యటనలో ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టును గాయాల బెడద వదలడం లేదు. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ వానిందు హసరంగ, ఛమీరా వంటి ప్లేయర్లు గాయపడడంతో ఇబ్బంది పడుతున్న లంక టీమ్కి రెండో టెస్టుకి ముందు మరో షాక్ తగిలింది...

శ్రీలంక బ్యాటర్ పథుమ్ నిశ్శంక గాయం కారణంగా బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగే రెండో టెస్టులో బరిలో దిగడం అనుమానంగా మారింది...
లంక టీమ్లో అంతో కొంతో ఫామ్లో ఉన్న బ్యాటర్ పథుమ్ నిశ్శంక. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 133 బంతులాడి 11 ఫోర్లతో 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు నిశ్శంక...
రెండో ఇన్నింగ్స్లో 19 బంతులాడి ఓ ఫోర్తో 6 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుటైన నిశ్శంక, లంక బ్యాటింగ్ ఆర్డర్లో 100+ బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాటర్గా నిలిచాడు...
‘పథుమ్ నిశ్శంక నడుము నొప్పితో బాధపడుతున్నాడు. అదీకాకుండా కొన్ని పాత గాయాలు, అతన్ని బాగా ఇబ్బందిపెడుతున్నాయి. ఫిజియో అతన్ని పర్యవేక్షిస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు లంక క్రికెట్ బోర్డు అధికారి...
తొలి టెస్టులో ఇన్నింగ్స్లో 222 పరుగుల తేడాతో ఓడిన శ్రీలంక జట్టు, డే నైట్ టెస్టుగా జరిగే రెండో టెస్టులో గెలవకపోయినా కనీసం డ్రా చేసుకుంటే చాలని కోరుకుంటోంది...
కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి బ్రేకులు లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ శర్మ, రెండో టెస్టు గెలిచి టెస్టు సారథిగా తొలి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్నాడు..
భారత జట్టు రెండో టెస్టులో ఓ మార్పు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి టెస్టులో అటు బ్యాటుతో రాణించక, బంతితోనూ వికెట్ తీయలేకపోయిన జయంత్ యాదవ్, రెండో టెస్టులో బరిలో దిగడం అనుమానమే...
భారత్లో అద్భుతమైన రికార్డు ఉన్న యంగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది...
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం స్పిన్ బౌలర్లకు చక్కగా సహకరిస్తుంది. దీంతో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లతో బరిలో దిగాలని భావిస్తోంది భారత జట్టు...