భువీ రీఎంట్రీ అదుర్స్... హాఫ్ సెంచరీ చేసిన సురేష్ రైనా... దినేశ్ కార్తీక్ అదిరే ఇన్నింగ్స్...
జనవరి 10న ప్రారంభమైన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 లీగ్లో భారత సీనియర్లు అదరగొట్టారు. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన పేసర్ భువనేశ్వర్ కుమార్... మొదటి మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఐపీఎల్ 2020 సీజన్లో గాయపడి దాదాపు మూడు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉంటున్న భువీ... పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్ 2020లో భువీ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన ఇది. అలాగే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టినా యూపీకి విజయాన్ని అందించలేకపోయాడు.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్టు కోల్పోయి 134 పరుగులు చేసింది. సిమ్రాన్ సింగ్ 43, అన్మోల్ ప్రీత్ సింగ్ 35 పరుగులు చేశాడు.
135 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన యూపీ...20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. మాధవ్ కౌషిక్ 21, ధృవ్ జురెల్ 23 పరుగులతో రాణించగా సురేష్ రైనా 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అయితే ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోయిన ఉత్తరప్రదేశ్... విజయానికి 11 పరుగుల దూరంలో ఆగిపోయింది...
మరో మ్యాచ్లో కర్ణాటక, జమ్మూ కాశ్మీర్పై 43 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
కెఎల్ శృజిత్ 31 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 48 పరుగులు చేయగా కెప్టెన్ కరణ్ నాయర్ 21 బంతుల్లో 27 పరుగులు చేశాడు. లక్ష్యచేధనలో జమ్మూకాశ్మీర్ 107 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా, కృష్ణప్ప గౌతమ్, అభిమాన్యు మిథున్, జగదీశ సుచిత్ రెండేసి వికెట్లు తీశారు. జమ్మూ టీమ్ ఆల్రౌండర్ అబ్దుల్ సమద్ 30 పరుగులు చేశారు.
బరోడా, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో బరోడా 5 పరుగులతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బరోడా 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేయగా స్మిత్ పటేల్ 30 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
లక్ష్యచేధనలో ఉత్తరాఖండ్ 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులకి పరిమితమైంది. దిక్షాంక్సు నేగి 57 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 77 పరుగులు చేయగా కునాల్ చండేలా 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు.
అస్సాంతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో ఓడింది. అస్సాం 159 పరుగులు చేయగా రియాగ్ పరాగ్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. లక్ష్యచేధనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 157 పరుగులకి పరిమతమైంది.
జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు 66 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తమిళనాడు ఇన్నింగ్స్లో హరి నిశాంత్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
జగదీశన్ 27 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. లక్ష్యచేధనలో జార్ఖండ్ 123 పరుగులే చేయగలిగింది.
ఇషాన్ కిషన్ 8 పరుగులకే అవుట్ కాగా విరాట్ సింగ్ 23, అనంద్ సింగ్ 28 పరుగులు చేశారు.
ఓడిశాపై బెంగాల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఓడిశా 113 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇషాన్ పొరెల్కి 4 వికెట్లు దక్కాయి.
బెంగాల్ 12.2 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. శ్రీవాస్తవ్ గోస్వామి 16 బంతుల్లో 25 పరుగులు చేయగా వివేక్ సింగ్ 35 బంతుల్లో 54, సువంకర్ బాల్ 23 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
రైల్వేస్, త్రిపురతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. త్రిపుర 170 పరుగుల భారీ స్కోరు చేయగా ఆ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి చేధించింది రైల్వేస్ జట్టు. రైల్వేస్ ఇన్నింగ్స్లో మృనాల్ దేవ్దర్ 61 పరుగులు, కర్ణ్ శర్మ 45 పరుగులు చేశారు.
మహారాష్ట్రపై గుజరాత్ 29 పరుగుల తేడాతో గెలిచింది. గుజరాత్ 157 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 30 పరుగులు చేశాడు.
లక్ష్యచేధనలో మహారాష్ట్ర 128 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులు చేయగా నౌసద్ షేక్ 31 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్ అర్జన్ నగస్వాల్ 3.3 ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి సంచలన స్పెల్ వేశాడు.
ఛత్తీస్ఘడ్పై హిమాచల్ ప్రదేశ్ 32 పరుగుల తేడాతో గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ 173 పరుగులు చేయగా ఛత్తేస్ఘడ్ 141 పరుగులకి పరిమితమైంది. అమన్దీప్ 87 పరుగులు చేసి తన జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు.