కోహ్లీ అలా చేస్తాడని మేం ఊహించలేదు.. దాదా షాకింగ్ కామెంట్స్
Virat Kohli: కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని తాము అస్సలు ఊహించలేదని అన్నాడు.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి తేనెతుట్టెను కదిపాడు. కోహ్లీ వర్సస్ బీసీసీఐ పై తాాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. 2021 లో కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు అతడిని డిసెంబర్ లో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తొలగించింది బీసీసీఐ. ఇది జరిగిన కొద్దిరోజులకే కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ పగ్గాలను కూడా వదిలేశాడు. ఇవన్నీ దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే జరిగాయి.
తాజాగా గంగూలీ.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని తాము అస్సలు ఊహించలేదని దాదా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అది కోహ్లీకే తెలియాలని వ్యాఖ్యానించాడు.
ఆజ్ తక్కు ఇచ్చిన ఇంటర్వ్యలో దాదా మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మేం అస్సలు ఊహించలేదు. బీసీసీఐ కూడా అందుకు సిద్ధంగా లేదు. సౌతాఫ్రికా టూర్ లో సిరీస్ పోయిందన్న నిరాశలో ఉన్న మాకు కోహ్లీ నిర్ణయం విస్మయం కలిగించింది. దానికి సమాధానం కోహ్లీకే తెలియాలి.
అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. విరాట్ తప్పుకున్నాక టెస్టులలో కూడా భారత్ కు కెప్టెన్ అవసరం వచ్చింది. అప్పటికే టీ20, వన్డేలలో సారథిగా ఉన్న రోహిత్ కే ఆ పగ్గాలు అప్పజెప్పాం. అప్పటికీ మాకు ఉన్న ఆప్షన్స్ లో అతడే బెస్ట్ అనిపించి అతడికే అప్పగించాం..’అని చెప్పుకొచ్చాడు.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతడి సారథ్యంలో భారత జట్టు 68 టెస్టులు ఆడింది. ఇందులో 40 మ్యాచ్ లలో విజయాలు సాధించి 17 మ్యాచ్ లు ఓడిపోయాడు. 11 మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఇందులో స్వదేశంలో 24 మ్యాచ్ లు గెలవగా విదేశాలలో 15 మ్యాచ్ లు గెలిచాడు.
కోహ్లీ టీ20ల నుంచి తప్పుకున్నా వన్డేలలో సారథిగా కొనసాగాలని భావించాడు. కానీ బీసీసీఐ ఇందుకు ఒప్పుకోలేదు. డిసెంబర్ లో కోహ్లి దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లే ముందు వన్డే కెప్టెన్సీ కోల్పోయాడు. అయితే తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించే గంటన్నర ముందు తనకు ఈ విషయం చెప్పారని అతడు వ్యాఖ్యానించడం ఆ సందర్భంగా దాదాపై చేసిన వ్యాఖ్యలతో భారత క్రికెట్ లో తీవ్ర చర్చ జరిగింది.