IPL 2021 మెగా వేలం వాయిదా... ఈసారికి మినీ వేలంతోనే... బీసీసీఐ ఆలోచన మారిందా?
ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ డూపర్ హిట్టైన తర్వాత 2021 సీజన్లో మార్పులు చేయాలని నిర్ణయించుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది సమ్మర్లో జరిగే ఐపీఎల్లో అదనంగా రెండు జట్లు చేర్చాలని, వీటికోసం త్వరలో మెగా వేలం నిర్వహించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. అయితే ఈసారికి ఈ ప్రయోగాలకు ‘కామా’ పెట్టాలని భావిస్తోందట భారత క్రికెట్ బోర్డు.
2021 ఐపీఎల్ సీజన్లో 10 జట్లు ఆడతాయని ప్రచారం జరిగింది. కొత్తగా చేరే జట్లలో ఓ జట్టు అహ్మదాబాద్ పేరుతో ఉంటుందని కూడా టాక్ వినిపించింది...
అయితే కరోనా కారణంగా 2020 సీజన్ ఆలస్యంగా జరగడంతో 2021 సీజన్కి పెద్దగా సమయం లేకుండా పోయింది. అదీకాకుండా స్టేడియాల్లోకి జనాలను అనుమతిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
కాబట్టి అదనపు జట్లను చేర్చే విషయం గురించి మరోసారి ఆలోచించాలని భావిస్తోందట బీసీసీఐ. ఈ సీజన్ను 8 జట్లతోనే జరిపించి, 2022 సీజన్లో మార్పులు చేస్తే బెటర్ అనే భావనలో భారత క్రికెట్ బోర్డు యాజమాన్యం ఉందని టాక్.
అదనపు జట్లను చేర్చే ఆలోచనను 2022కి వాయిదా వేయడంతో మెగా వేలం 2021 కూడా ఆ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది...
సాధారణంగా ప్రతీ మూడేళ్లకు ఓసారి మెగా వేలం నిర్వహిస్తారు. ఈ వేలంలో ప్రతీ జట్టులో ఉన్న మెజారిటీ ఆటగాళ్లు వేలంలోకి వస్తారు. ఇద్దరు విదేశీ, ముగ్గురు స్వదేశీ ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ప్రాంఛైజీలకు అవకాశం ఉంటుంది.
అయితే ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలంతోనే సరిపెట్టాలని భావిస్తోంది బీసీసఐ. 2022లో అదనంగా మరో రెండు జట్లు చేరతాయి కాబట్టి అప్పుడు మెగా వేలం నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది.
మెగా వేలానికి ముందు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీ ఆరంభం కానుంది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే ఈ స్వదేశీ టీ20 లీగ్లో సత్తా చాటిన యువఆటగాళ్లు, వేలంలో భారీ ధర దక్కించుకునేందుకు అవకాశం దొరుకుతుంది.
కరోనా కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే... 2021 ఐపీఎల్ స్వదేశంలోనే షెడ్యూల్ ప్రకారం మార్చి నెల చివరలోనే ఆరంభం అవుతుందని ప్రకటించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.