నాలుగున్న నెలల్లో 22 సార్లు కరోనా పరీక్షలు... బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కష్టాలు!
కరోనా వైరస్ కారణంగా క్రికెట్తో పాటు విశ్వక్రీడలన్నీ వాయిదా పడిన సమయంలో ఐపీఎల్ నిర్వహించి, అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ... విపత్కర పరిస్థితుల నడుమ ఎన్నో దేశాల క్రికెటర్లను ఒక చోట చేర్చి, నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్ సూపర్ సక్సెస్ సాధించి బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. అయితే ఇదే సమయంలో గంగూలీ 22 సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారట.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తి భద్రత నడుమ బయోబబుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13ని నిర్వహించింది బీసీసీఐ...
భారత్కి దూరంగా ఏడాది దేశం యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020 వీక్షించేందుకు ప్రేక్షకులను కూడా అనుమతించలేదు. బయో బబుల్ దాటి క్రికెటర్లను కూడా బయటికి వెళ్లేందుకు అనుమతించలేదు.
ఐపీఎల్ దుబాయ్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత యూఏఈకి వెళ్లి అక్కడ ఏర్పాట్లు, పరిస్థితులను సమీక్షించారు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ..
ఆ తర్వాత మ్యాచులు జరుగుతున్నన్ని రోజులు బిజీబిజీ షెడ్యూల్లో గడిపారు. ఐపీఎల్ సూపర్ సక్సెస్ తర్వాత ఆస్ట్రేలియా టూర్కి కూడా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
ఆసీస్ పర్యటనలో ఆటగాళ్ల భద్రత పర్యవేక్షించేందుకు సిడ్నీకి చేరిన సౌరవ్ గంగూలీ... ప్రస్తుతం క్వారంటైన్లో గడుపుతున్నారు..
‘నేను గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఒక్కసారి కూడా పాజిటివ్ రిజల్ట్ రాలేదు... నా చుట్టు చాలామందికి పాజిటివ్ రావడంతో నేను మళ్లీ మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.
‘మా ఇంట్లో అమ్మానాన్న కూడా ఉంటారు. వాళ్లకి వయసు పెరిగింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు భయపడ్డాను. కరోనా పరీక్షలు చేయించుకున్నా కూడా ఎక్కడో ఏదో ఓ మూల భయం మిగిలిపోయింది...
నా కోసం మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా చాలా ఆలోచించాను. నా వల్ల మరోకరికి వైరస్ వ్యాప్తి చేయకూడదనేది నా సిద్ధాంతం... అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వివరించాడు దాదా.
దక్షిణా ఆస్ట్రేలియా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో ఆస్ట్రేలియాతో క్రికెట్ ఆడడం అవసరమా? అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చిన సౌరవ్ గంగూలీ... ‘ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా విస్తరణ తక్కువగానే ఉంది. లాక్డౌన్ విధించి, కేసులు తగ్గిస్తున్నారు. అందులోనూ పూర్తిగా నిబంధనలను అనుసరించే సిరీస్ నిర్వహిస్తున్నాం... ’ అని చెప్పారు.
భారత ఆటగాళ్లు పూర్తి ఫిట్గా ఉన్నారు. క్రికెట్ ఆడబోయే ప్రతీ ఒక్కరూ 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపిన గంగూలీ, కరోనా టైమ్లో ఐపీఎల్ 2020 సీజన్ను విజయవంతంగా పూర్తిచేయడం గర్వంగా ఉందని తెలిపారు.
ఐపీఎల్ 2020 సమయంలో బయోబబుల్లో 400 మంది ఆటగాళ్లు, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. లీగ్ గడిచిన సమయంలో మొత్తం 30 వేల నుంచి 40 వేల కరోనా టెస్టులు నిర్వహించాం...’ అని తెలిపారు సౌరవ్ గంగూలీ.
యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా భారత క్రికెట్ బోర్డుకి 4 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే...