భారత్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021... భారత ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లిస్తున్న ట్యాక్స్ ఎంతంటే...
భారత క్రికెట్ బోర్డు 2021 టీ20 క్రికెట్ వరల్డ్కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఈ టోర్నీ నిర్వహణ కోసం బీసీసీఐ... భారీ మొత్తంలో భారత ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించబోతోంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ నిర్వహణ ఏర్పాట్లు ఈవెంట్ల రూపంలో దాదాపు 906 కోట్ల రూపాయాలు, బీసీసీఐ నుంచి భారత ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
క్రీడా ప్రోత్సాహక ఈవెంట్ కింద ఐసీసీ వరల్డ్కప్కి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది బీసీసీఐ. అయితే భారత ప్రభుత్వం ఇందుకు సుముఖంగా లేదు.
క్రికెట్కి భారత్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు జనాలు స్టేడియానికి ఎగబడతారు.
అదీకాక స్పాన్సర్షిప్లు, బ్రాండ్ అంబాసిడింగ్, బ్రాడ్ కాస్టింగ్ రూపంలో వేల కోట్లు ఆర్జించనుంది బీసీసీఐ.
వేల కోట్ల ఆదాయం ఇచ్చే ఈవెంట్కి పన్ను మినహాయింపు ఎందుకనేది భారత ప్రభుత్వ వాదన.
అయితే ఐసీసీ నియమాల ప్రకారం పన్ను మినహాయింపుల ఒప్పందం కింద ఆతిథ్య దేశం, టోర్నీ ఆడబోయే దేశాలన్నీ సంతకాలు చేయాల్సి ఉంటుంది...
భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోతే... టోర్నీని దుబాయ్కి తరలించి, యూఏఈ తటస్థ వేదికలపై మ్యాచులు నిర్వహించాలంటూ బీసీసీఐకి సలహా ఇచ్చింది ఐసీసీ...
పన్ను మినహాయింపు పొందేందుకు ఇచ్చిన రెండు డెడ్లైన్లను మిస్ చేసుకుంది బీసీసీఐ. ప్రభుత్వం నుంచి టోర్నీ నిర్వహణకు అనుమతి తెచ్చుకునేందుకు ఆఖరి గడువు ఫిబ్రవరి 2021.
ఒకవేళ పన్ను పూర్తిగా మినహాయించకపోయినా, పాక్షిక మినహాయింపు పొందినా రూ.227 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లించాల్సి ఉంటుంది...
అయితే బీసీసీఐ అధికారులు టీ20 వరల్డ్కప్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు సమాచారం. పన్ను చెల్లించైనా సరే, టోర్నీ నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.
టీ20 వరల్డ్కప్ నిర్వహణ కోసం ఎనిమిది వేదికలను షార్ట్ లిస్టు చేసింది బీసీసీఐ. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, మొహాలి, ధర్మశాల, కోల్కత్తా, ముంబై నగరాలు వరల్డ్కప్కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.