మళ్లీ యోయో.. కొత్తగా డెక్సా.. టీమ్లోకి రావాలంటే ఈ రెండూ పాసవ్వాల్సిందే..
BCCI: గతేడాది గాయాలతో సతమతమైన టీమిండియాను గాడిలో పెట్టడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన నిర్ణయాలతో ముందుకొచ్చింది. జట్టులో చోటు దక్కించుకోవాలంటే పలు కఠిన పరీక్షలు పాస్ కావాల్సిందే.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, రిషభ్ పంత్.. పేరు ఏదైనా టీమిండియా గతేడాదంతా గాయాలతో సావాసం చేసింది. అసలు పూర్తిస్థాయి జట్టుతో భారత్ ఒక అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలాకాలం దాటింది.
ఫిట్నెస్, గాయాలు దానికి ప్రధాన కారణాలు. గాయాల కారణంగా భారత జట్టు ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలకు పూర్తిస్థాయి జట్టు లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ కారణంగా టీమిండియాకు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో బీసీసీఐ కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది.
గతంలో మాదిరిగా ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పకుండా ఉండాల్సిన అర్హతలను తిరిగి ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే యోయో టెస్టుతో పాటు కొత్తగా డెక్సా టెస్టును కూడా తీసుకొచ్చింది. టీమిండియాకు ఆడాలంటే ఈ రెండు టెస్టులూ పాస్ అవ్వాల్సిందే.
టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథిగా వ్యవహరించిన సమయంలో యోయో టెస్టును తీసుకొచ్చారు. దీని ప్రకారం ఆటగాళ్లు 20 మీటర్ల దూరంలో ఉన్న మార్కర్ల మధ్య పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో మొదట పాస్ స్కోరును 16.5గా నిర్ణయించి తర్వాత 16.1కు తగ్గించారు.
తర్వాత ఏమైందో ఏమో గానీ అటు బీసీసీఐ, ఇటు ఆటగాళ్లు దీని మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఫిట్నెస్ పూర్తిస్థాయిలో లేకున్నా ఆటగాళ్లు టీమ్ లోకి రావడం, మళ్లీ గాయాల బారని పడి నెలలకు నెలలు జట్టుకు దూరమవడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు మళ్లీ యోయో టెస్టును తప్పనిసరి చేశారు.
యోయో తో పాటు కొత్తగా ఇప్పుడు డెక్సాను కూడా ప్రవేశపెట్టనున్నారు. డెక్సా టెస్టు బోన్ స్కానింగ్ టెస్ట్. ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తిలోని ఎముకల బలాన్ని, బోన్స్ మధ్య ఏదైనా గ్యాప్ ఉందా..? ఉంటే దాని ప్రభావం సదరు వ్యక్తి మీద పడుతుందా..? వంటి విషయాలను గుర్తించొచ్చు. క్రికెటర్లు ఏదైనా గాయాల బారిన పడి ఉన్నా ముందే గుర్తించే అవకాశం కూడా ఉంది. దీంతో సదరు క్రికెటర్ ను సిరీస్ లో ఆడించొచ్చా.. లేదా పక్కనబెట్టాలా అన్న విషయంపై స్పష్టత వస్తుంది.
గతేడాది చాలా మ్యాచ్ లలో భారత్ తరఫున ఆడిన ఆటగాళ్లలో పలువురు క్రికెటర్లు చిన్న చిన్న గాయాలను లెక్కచేయకుండానే బరిలోకి దిగారు. అవికాస్తా పెద్ద గాయాలై నెలలకు నెలలు ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. బుమ్రా, జడేజాల గాయాలు అలాంటివే.. ఇప్పుడు డెక్సాతో ఈ చిన్న గాయాలను, ఆటగాళ్లు ఫిట్ గా ఉన్నారా..? లేదా..? అన్న విషయాన్ని కచ్చితంగా గుర్తించే అవకాశం ఉండటంతో ఎవరిని ఆడించాలి..? ఎవరికి విశ్రాంతినివ్వాలి..? అన్న విషయంలో క్లారిటీతో ఉండొచ్చని బీసీసీఐ భావిస్తున్నది.