- Home
- Sports
- Cricket
- IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఆ ప్లేయర్లంతా క్యాంపులకు కష్టమే..
IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాకిచ్చిన బీసీసీఐ.. ఆ ప్లేయర్లంతా క్యాంపులకు కష్టమే..
BCCI Gives Shock To IPL Franchises: ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్-2022 సీజన్ కు ముందు ప్రీ క్యాంపులను ఏర్పాటు చేసుకుందామనుకుంటున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు క్యాంపులను ఏర్పాటు చేసుకుని ఆటగాళ్లను ఈ మెగా లీగ్ ముందు మరింత సానబెడుదామని అనుకున్న ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఊహించని షాకిచ్చింది.
బీసీసీఐతో కాంట్రాక్టు ఉన్న, నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లు అంతా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో నిర్వహించతలపెట్టిన ఫిట్నెస్ క్యాంపునకు హాజరు కావాలని ఆదేశించింది.
ఎన్సీఏలో పది రోజుల పాటు ఈ క్యాంపు జరుగనుంది. ఈ నిర్ణయం ఐపీఎల్ సీజన్ కు ముందు ఫ్రాంచైజీలకు పెద్ద షాక్ వంటిదే. మార్చి 6 న రంజీలు ముగిసిన తర్వాత సదరు ఆటగాళ్లంతా ఎన్సీఏకు చేరుకోవాల్సిందేనని సూచించింది.
ఎన్సీఏ క్యాంపునకు హాజరు కావాల్సి ఉన్న ఆటగాళ్లు : రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్
అయితే ఈ క్యాంపునకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తో పాటు ఇండియా-శ్రీలంక టెస్టు సిరీస్ లో పాల్గొంటున్న ఆటగాళ్లకు మినహాయింపునిచ్చింది. వీళ్లంతా రెండో టెస్టు అనంతరం (మార్చి మార్చి 16 తర్వాత) వారి వారి ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కలిసేందుకు అవకాశం ఇచ్చింది.
ఐపీఎల్ కు ముందు ఆటగాళ్ల ఫిట్నెస్, ఇతర అంశాల మీద దృష్టి సారించేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలాఉండగా.. కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే గాయాల బారిన పడి ఎన్సీఏ లోనే ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు.. ఎన్సీఏ ఫిట్నెస్ క్యాంపుతో కలవనున్నారు.
ఐపీఎల్ లో ఇప్పటికే ప్రీ క్యాంపుల నిర్వహణ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు ఏర్పాట్లను పూర్తి చేశాయి. చెన్నైకి చెందిన పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సూరత్ చేరుకున్నారు.
ఇక హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కూడా మార్చి 10 నుంచి ముంబైలో క్యాంపునకు ఏర్పాట్లు చేస్తున్నది. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ షెడ్యూల్ లో మార్పులు చేసుకుంటాయా..? అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.. భారత ప్లేయర్లను మినహాయిస్తే.. అందుబాటులో ఉండే విదేశీ ఆటగాళ్లతో ఐపీఎల్ జట్లు క్యాంపులను నిర్వహించుకోవచ్చు. అయితే వాళ్లు ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి.