Virat Kohli: విరాట్ కు అప్పుడే చెప్పాం.. కానీ మా మాట వినలేదు : భారత వన్డే కెప్టెన్సీపై స్పష్టతనిచ్చిన దాదా
Sourav Ganguly: టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. ఉన్నఫళంగా విరాట్ ను వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై అతడి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
భారత క్రికెట్ లో విజయవంతమైన సారథిగా గుర్తింపు పొంది అనూహ్య పరిస్థితుల్లో వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ అంశంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు.
వన్డే కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ కోహ్లీపై ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నదని.. ఈ అంశంలో విరాట్ కు బోర్డు పెద్దలు 48 గంటలు టైమ్ ఇచ్చినా అతడు స్పందించకపోయేసరికే కెప్టెన్సీ పదవి ఊడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా గంగూలీయే ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించాడు.
గంగూలీ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ కి రాజీనామా చేయొద్దని మేం చెప్పాం. కానీ అతడు మా మాటను పట్టించుకోలేదు. ఆ ఫార్మాట్ కెప్టెన్ గా తప్పుకోవాలనే నిర్ణయించుకున్నాడు.
దీంతో సెలెక్టర్లు కూడా వన్డేలకు, టీ20 లకు వేర్వేరు సారథులు ఉంటే నాయకత్వ సమస్యలు వస్తాయని, అది భారత జట్టుకు ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని భావించారు.
ఇతర వివరాలు చెప్పలేను గానీ అన్నింటికంటే ప్రధానమైన కారణం మాత్రం ఇదే. ఇక వన్డేలలో కోహ్లీ కెప్టెన్సీ రికార్డు భాగుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దానిని కూడా మేం పరిశీలించాం.
అయితే ఇదే సమయంలో తాను బాధ్యత తీసుకున్న మ్యాచులలో రోహిత్ తానెంటో నిరూపించుకున్నాడు. అతడు ఇక స్టాండ్ బై కెప్టెన్ గా కాక పూర్తి స్థాయిలో రాణిస్తాడనే ఆశిస్తున్నాం.
ఈ విషయాన్ని కోహ్లీకి నేనే కాదు.. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కూడా స్వయంగా చెప్పాం. మా నిర్ణయాన్ని విరాట్ కూడా అంగీకరించాడు...’ అంటూ గంగూలీ అన్నాడు.
ఇక రాబోయే కీలక సిరీస్ లతో పాటు ఐసీసీ ఈవెంట్లలో కూడా రోహిత్ తన మార్కును చూపిస్తాడని తాను ఆశిస్తున్నట్టు గంగూలీ తెలిపాడు. ఇటీవలే న్యూజిలాండ్ తో మూడు మ్యాచులు టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా 3-0తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక కోహ్లీ గైర్హాజరీలో రోహిత్.. భారత్ కు 10 వన్డేలలో సారథ్యం వహించగా.. 8 మ్యాచులలో భారత్ గెలిచింది.