- Home
- Sports
- Cricket
- Asia Cup 2025 Final: అభిషేక్ శర్మ vs షాహీన్ ఆఫ్రిదీ.. ఇండియా - పాక్ మ్యాచ్లో కీలక మలుపు !
Asia Cup 2025 Final: అభిషేక్ శర్మ vs షాహీన్ ఆఫ్రిదీ.. ఇండియా - పాక్ మ్యాచ్లో కీలక మలుపు !
Asia Cup 2025 Final: 41 ఏళ్ల తర్వాత ఇండియా, పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, షాహీన్ ఆఫ్రిదీ మధ్య పోరు మ్యాచ్ ఫలితంలో కీలకం కానుంది. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

ఆసియా కప్ ఫైనల్: అభిషేక్ శర్మ vs షాహీన్ ఆఫ్రిదీ
ఆసియా కప్ 2025 ఫైనల్లో ఇండియా-పాకిస్తాన్ తలపడుతున్నాయి. 41 ఏళ్ల తర్వాత భారత్ పాకిస్తాన్ లు ఆసియా కప్ ఫైనల్ లో పోటీపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కు ముందు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది అభిషేక్ శర్మ–షాహీన్ ఆఫ్రిదీ పోరు. దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో ఈ ఇద్దరి మధ్య పోటీనే ఫలితాన్ని నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా ఇది “ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్టైన్మెంట్” అవుతుందని అన్నారు.
మోర్కెల్ మాట్లాడుతూ, “షాహీన్ ఎప్పుడూ దూకుడుగా బౌలింగ్ చేస్తాడు. అతను వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాడు. అభిషేక్ కూడా వెనుకడుగు వేయడు. ఈ ఇద్దరూ తలపడిన ప్రతీసారీ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. ఇది ఆటకు చాలా మంచి విషయం” అని వ్యాఖ్యానించారు.
అభిషేక్ vs షాహీన్: గణాంకాలు ఎలా ఉన్నాయి?
25 ఏళ్ల వయసులో ఇద్దరూ విభిన్న దశల్లో ఉన్నారు. షాహీన్ పాకిస్తాన్ బౌలింగ్కు అనేక ఏళ్లుగా నాయకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ మాత్రం ఈ ఆసియా కప్లో మెరుపు లాంటి ఎంట్రీ ఇచ్చాడు. ఆరు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఒక్కసారి కూడా 30 కంటే తక్కువ స్కోరు చేయలేదు.
పాకిస్తాన్పై అభిషేక్ మరింత దూకుడుగా ఆడాడు. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో ఆఫ్రిదీ బౌలింగ్ లో స్ట్రైట్ డ్రైవ్ బౌండరీ కొట్టాడు. వారం తర్వాత అతని తొలి బంతిని హుక్ షాట్తో సిక్సర్గా పంపించాడు. ఇప్పటివరకు ఆసియా కప్లో ఆఫ్రిదీ బౌలింగ్లో 14 బంతుల్లో 31 పరుగులు పిండుకున్నాడు అభిషేక్ శర్మ.
షాహీన్ భారత్ కు షాకిస్తాడా?
షాహీన్ ఆఫ్రిదీకి ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం ఉంది. 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ను తొలి ఓవర్లోనే ఔట్ చేసి భారత్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇటీవల భారత్పై రికార్డు కొంచెం తగ్గినా, శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ల్లో మళ్లీ ఆరంభంలోనే వికెట్లు తీసి తన బౌలింగ్ పదును చూపించాడు.
ఈ ఫైనల్లో అభిషేక్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా? లేక షాహీన్ మళ్లీ మ్యాజిక్ చూపిస్తాడా? అనేది అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇండియా తప్పులు సరిదిద్దుకోవాలి.. లేకుంటే కష్టమే !
ఇప్పటివరకు ఇండియా ఆడిన ఆరు మ్యాచ్లన్నింటినీ గెలిచింది. పాకిస్తాన్పై రెండు సార్లు, యుఏఈ, ఒమన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై ఒక్కోసారి విజయం సాధించింది. అయితే శ్రీలంక మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. భారత బ్యాటింగ్, బౌలింగ్ మొత్తంగా మ్యాచ్ పై ప్రభావం చూపించకపోయినా.. ఓపెనర్లు రాణించని సమయంలో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతోంది. అలాగే, ఫీల్డింగ్ లో కూడా పలు తప్పిదాలు చేస్తోంది.
మోర్కెల్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు పూర్తి ఆట ఆడలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఇంకా మెరుగుదల అవసరం ఉంది. కఠిన పరిస్థితుల్లో రన్ రోటేషన్, భాగస్వామ్యాల కాపాడటం ముఖ్యం. బౌలింగ్లో తొలి ఆరు ఓవర్లలో లైన్, లెంగ్త్ మెరుగుపరచాలి. మధ్య ఓవర్లలో యార్కర్లు ఉపయోగించాలి. ఫీల్డింగ్లో క్యాచింగ్పై మరింత శ్రద్ధ పెట్టాలి” అని వివరించారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సవాళ్లు
అభిషేక్ శర్మ ఇప్పటివరకు బెస్ట్ బ్యాట్స్మన్గా నిలిచాడు. 300 కంటే ఎక్కువ పరుగులు, 200 కంటే ఎక్కువ స్ట్రైక్రేట్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. అయితే అతను త్వరగా ఔట్ అయితే జట్టు ఆట దూకుడుగా సాగడం లేదు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడు. శుభ్మన్ గిల్ నుంచి పెద్ద స్కోర్లు రావడం లేదు.
బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 13 వికెట్లు తీసి స్టార్గా నిలిచాడు. కానీ పేసర్లు స్థిరత్వం చూపలేదు. హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై సందేహాలున్నాయి. అతను అందుబాటులో లేకపోతే అర్షదీప్ సింగ్కు అవకాశం ఉంటుంది.
ఫీల్డింగ్లో మాత్రం టీమిండియా విఫలమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ల్లో 10 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. శ్రీలంక మ్యాచ్లోనూ పొరపాట్లు జరిగాయి. సునీల్ గవాస్కర్ కూడా ఫీల్డింగ్పై విమర్శలు చేశారు.
భారత్ vs పాకిస్తాన్ : ఫైనల్ సవాళ్లు
ఫైనల్లో ఇండియా అన్ని విభాగాల్లో పూర్తిగా ఆడకపోతే ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ జట్టు చివరి మ్యాచ్ లను గెలిచి ఉత్సాహంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఇండియా అన్ని విభాగాల్లోనూ కచ్చితమైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఈ మ్యాచ్ కేవలం ట్రోఫీ కోసం కాదు. రాబోయే టీ20 వరల్డ్ కప్కు ముందు జట్టు బలాన్ని నిరూపించుకునే వేదికగా నిలుస్తుంది.