ఆసియా కప్- 2021 రద్దు... శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం... మళ్లీ రెండేళ్ల తర్వాతే...
కరోనా వైరస్ కారణంగా పీఎస్ఎల్, ఐపీఎల్ 2021 వంటి టోర్నీలకు బ్రేక్ పడగా... తాజాగా మరో ఐసీసీ టోర్నీ రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం జూన్లో జరగాల్సిన ఆసియా కప్ 2021 సీజన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు...
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, భారత్తో పాటు ఉపఖండ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. శ్రీలంకలోనూ కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి...
‘శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసియా కప్ టోర్నీని నిర్వహించడం చాలా కష్టం. అందుకే వచ్చే నెలలో జరగాల్సిన ఈ క్రికెట్ టోర్నీని రద్దు చేస్తున్నాం’ అంటూ ప్రకటించాడు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో యాష్లే డిసిల్వా...
వాస్తవానికి 2020లోనే ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం గత ఏడాది పాకిస్తాన్లో జరగాల్సిన ఈ టోర్నీ, కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది...
పాక్లో పర్యటించేందుకు భారత క్రికెటర్లు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టోర్నీని శ్రీలంకను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి టీమిండియా అర్హత సాధించడంతో ఈ టోర్నీపై మరోసారి అనుమానాలు రేగాయి.
‘టీమిండియా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్కి ఫైనల్కి అర్హత సాధిస్తే, జూన్లో జరగాల్సిన ఆసియా కప్ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తాం... ’ అంటూ ఇంగ్లాండ్ సిరీస్కి ముందు వ్యాఖ్యానించింది పాక్ క్రికెట్ బోర్డు.
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్కి టీమిండియా అర్హత సాధించినా, శ్రీలంకలో జరిగే ఆసియా కప్లో యువ ఆటగాళ్లతో కూడిన భారత ఏ జట్టును పంపాలని భావించింది బీసీసీఐ...
ఇంగ్లాండ్ టూర్కి వెళ్తున్న టీమిండియాలో స్థానం దక్కించుకోని వన్డే, టీ20 జట్టుతో శ్రీలంకలో పరిమిత ఓవర్ల టోర్నీలు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి కారణం కూడా టీ20 వరల్డ్కప్తో పాటు ఆసియా కప్కి యువఆటగాళ్లను సిద్ధంగా ఉంచడమే అనుకున్నారంతా...
జూన్ తర్వాత ఆసియా కప్లో పాల్గొనే భారత్, పాక్, ఆఫ్ఘాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు చాలా బిజీ షెడ్యూల్తో గడపనున్నాయి. దీంతో 2023 వన్డే వరల్డ్కప్ తర్వాతే ఆసియా కప్ జరిగే అవకాశం ఉంది.
2018లో జరిగిన ఆసియాకప్ టోర్నీని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆసియా కప్ టోర్నీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు.