- Home
- Sports
- Cricket
- ద్రావిడ్కు రెస్ట్ ఇస్తే తప్పేంటి..? రవిశాస్త్రికి కౌంటర్ ఇస్తున్న టీమిండియా క్రికెటర్లు
ద్రావిడ్కు రెస్ట్ ఇస్తే తప్పేంటి..? రవిశాస్త్రికి కౌంటర్ ఇస్తున్న టీమిండియా క్రికెటర్లు
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఆటగాళ్ల మాదిరిగానే విరామమివ్వడంపై వస్తున్న విమర్శలకు భారత జట్టు ఆటగాళ్లు గట్టిగానే తిప్పికొడుతున్నారు. కోచ్ కూడా అందరిలాగే మామూలు మనిషేనని అతడికి రెస్ట్ ఇస్తే తప్పేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, అశ్విన్ లకు విశ్రాంతి లభించింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కూడా విరామమిచ్చిన బీసీసీఐ.. ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించింది.
అయితే ద్రావిడ్ కు విశ్రాంతినివ్వడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. అసలు హెడ్ కోచ్ లకు రెస్ట్ ఇవ్వడమేంటని..? తాను మాత్రం ఇందుకు వ్యతిరేకమని, కోచ్ అనేవాడు నిత్యం జట్టుతో ఉండి మ్యాచ్ విన్నర్లను గుర్తించే పనిలో నిమగ్నమవ్వాలని విమర్శించాడు.
ఐపీఎల్ టైమ్ లో ఎలాగూ టీమిండియా హెడ్ కోచ్ కు రెండు నెలల విరామం దొరుకుతుంది కదా..? మళ్లీ ప్రతీ రెండు మూడు సిరీస్ లకు విశ్రాంతినివ్వడం దేనికి..? అని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కామెంట్లపై తాజాగా టీమిండియా క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్ లు స్పందించారు. ఈ ఇద్దరూ ద్రావిడ్ కు మద్దతుగా నిలిచారు.
అశ్విన్ స్పందిస్తూ.. ‘ద్రావిడ్ కు రెస్ట్ ఇస్తే తప్పేంటి..? క్రికెట్ లో ఆటగాడైనా కోచ్ అయినా వారి సహాయక సిబ్బంది అయినా ఒకే రకమైన ఒత్తిడిని ఎదుర్కుంటారు. వారికి మానసిక ప్రశాంతత కావాలి. కేవలం ఆటగాళ్లకే రెస్ట్ ఇచ్చి కోచింగ్ సిబ్బందిని నిత్యం కష్టపడమనడం సరైంది కాదు. వాళ్లు కూడా మనుషులే. యంత్రాలు కాదు. వారికీ విశ్రాంతి అవసరమే..
టీ20 ప్రపంచకప్ ప్రిపరేషన్ లో ద్రావిడ్ అండ్ టీమ్ ఎలా సన్నద్దమైందో నేను స్వయంగా చూశాను. ప్రతీ మ్యాచ్ కు వారికి నిర్దిష్ట ప్రణాళికలను తయారుచేసుకోవాలి. మ్యాచ్ లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించాలి. వాటిని అమలయ్యేలా చూడటం వంటివన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అందుకే ప్రతీ ఒక్కరికి విరామం కావాలి..’ అని వ్యాఖ్యానించాడు.
తాజాగా దినేశ్ కార్తీక్ కూడా ఈ విషయమై స్పందించాడు. భారత్ ప్రస్తుతం ఆడుతున్న బిజీ షెడ్యూల్ లో ద్రావిడ్ కు రెస్ట్ ఇవ్వడం సమర్థించదగినదే అని తెలిపాడు. ఈ విషయంలో భారత్ కూడా ఇంగ్లాండ్ ఫార్ములాను పాటించాలని సూచించాడు .
ఇంగ్లాండ్ లో టెస్టులకు మెక్ కల్లమ్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తుండగా వన్డే, టీ20లకు మరో కోచ్ ఉన్నాడు. భారత్ కూడా ఈ విధానాన్ని పాటిస్తే బెటరని కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరు కోచ్ ల వల్ల లాభమే గానీ నష్టపోయేదేమీ లేదని కార్తీక్ సూచించాడు.