అదరగొట్టిన అంబటి రాయుడు... సిక్సర్లతో చెలరేగిన తెలుగు క్రికెటర్... ముంబైపై సీఎస్కే భారీ స్కోరు...
ఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటిదాకా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్తో మెరుపులు మెరిపించాడు. రాయుడితో పాటు మొయిన్ ఆలీ, డుప్లిసిస్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది సీఎస్కే...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్కి శుభారంభం దక్కలేదు. ఓ ఫోర్ బాదిన రుతురాజ్ గైక్వాడ్, మొదటి ఓవర్లోనే హార్ధిక్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది సీఎస్కే...
ఆ తర్వాత మొయిన్ ఆలీ, డుప్లిసిస్ కలిసి రెండో వికెట్కి 108 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత 28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసిన డుప్లిసిస్, కిరన్ పోలార్డ్ బౌలింగ్లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే 2 పరుగులు చేసిన సురేశ్ రైనా కూడా భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్ల బౌలింగ్లోనూ ఈజీగా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 72 పరుగులు చేసిన అంబటి రాయుడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో రవీంద్ర జడేజా 22 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
అంబటి రాయుడు సిక్సర్ల మోత కారణంగా ఐపీఎల్లో తన చెత్త ప్రదర్శన నమోదుచేసుకున్నాడు బుమ్రా. 4 ఓవర్లలో ఓ వికెట్ మాత్రమే తీసిన బుమ్రా 56 పరుగులు సమర్పించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ ఎప్పుడూ 200+ స్కోరును చేధించలేదు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి 200+ నమోదుచేయడం 19వ సారి...