Asia Cup: భారత్తో మ్యాచ్కు ముందు పాక్కు భారీ షాక్! కీలక బౌలర్కు గాయం
India Vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఆగస్టు 28న జరగాల్సి ఉంది. ఆసియా కప్ లో భాగంగా దాయాదులు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు పాక్ కు ఊహించని షాక్ తగిలింది.
ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ కోసం మిగిలిన నాలుగు జట్లతో పాటు ఇండియా-పాకిస్తాన్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టోర్నీలో ఫేవరెట్లుగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు ఆగస్టు 28న దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.
గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ ను చిత్తుగా ఓడించిన ఉత్సాహంతో పాకిస్తాన్.. ఆ మ్యాచ్ కు బదులు తీర్చుకోవాలనే సంకల్పంతో భారత జట్టు బరిలోకి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు భారీ షాక్ తప్పేట్టు లేదు.
2021 పొట్టి ప్రపంచకప్ లో భాగంగా భారత టాపార్డర్ ను పడగొట్టిన ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఆసియా కప్ లో భారత్ తో జరుగబోయే మ్యాచ్ కు ఆడటం అనుమానమే అని తెలుస్తున్నది. మోకాలి గాయం కారణంగా అఫ్రిది రాబోయే నెదర్లాండ్స్ వన్డే సిరీస్ కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించాడు.
అఫ్రిది గురించి స్పందిస్తూ.. ‘షాహీన్ కు మోకాలి గాయం అయింది. మేం అతడికి ఎక్కువ విరామం ఇవ్వాలని భావిస్తున్నాం. అఫ్రిది ఫిట్నెస్, ఆరోగ్యం దృష్ట్యా అతడిని మేం నెదర్లాండ్స్ టూర్ లో ఆడించడం లేదు. అయితే అతడు జట్టుతోనే ఉంటాడు. వైద్యుల పర్యవేక్షణలో అఫ్రిది త్వరగా కోలుకుంటాడు. రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లు ఉన్న నేపథ్యంలో మేము అతడిపై ఒత్తిడి పెంచాలనుకోవడం లేదు..’ అని బాబర్ తెలిపాడు.
మోకాలిగాయం నుంచి అతడు కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని బాబర్ చెప్పుకొచ్చాడు. ఆసియా కప్ వరకు అఫ్రిది అందుబాటులోకి వస్తాడా..? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘చేరాలనే మేమూ ఆశిస్తున్నాం..’ అని బదులిచ్చాడు.
గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా అఫ్రిది.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ల వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. తొలి రెండు ఓవర్లలో అతడు చేసిన డ్యామేజ్ తో భారత జట్టు కోలుకోలేదు. కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాటర్లు అంతగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా భారత్ దారుణంగా విఫలమైంది. ఫలితంగా భారత్ ను పాక్ పది వికెట్ల తేడాతో ఓడించింది.