- Home
- Sports
- Cricket
- మీకో న్యాయం మాకో న్యాయమా..? మేమూ భారత్కు వచ్చేది లేదు.. వన్డే వరల్డ్కప్పై పాకిస్తాన్ వింత వాదన
మీకో న్యాయం మాకో న్యాయమా..? మేమూ భారత్కు వచ్చేది లేదు.. వన్డే వరల్డ్కప్పై పాకిస్తాన్ వింత వాదన
ICC ODI World Cup 2023: ఆసియా కప్ వివాదం ముగిసిందని సంతోషించేలోపే పాకిస్తాన్ మరో కొత్తరాగం అందుకున్నది. ఈసారి తమకు టైమ్ వచ్చిందని తేనెతుట్టెను కదుపుతోంది.

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతాయి. అయితే ఇకనుంచి మ్యాచ్ లే కాదు.. మ్యాచ్ జరిగేందుకు జరిగే ప్రక్రియ కూడా అంతకుమించిన ఉత్కంఠను కలిగించనుంది. ఆసియా కప్ - 2023 నిర్వహణ వివాదంలో భాగంగా.. భారత్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికగా నిర్వహించేందుకు అంగీకరించిన పాకిస్తాన్.. ఇప్పుడు తమ టైమ్ వచ్చిందని కొత్త సమస్యలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
పాకిస్తాన్ లో జరుగబోయే ఆసియా కప్ - 2023 లో భాగంగా భారత్ ఆడే మ్యాచ్ లు తటస్థ వేదిక (ఓమన్, దుబాయ్, శ్రీలంక అని ప్రచారంలో ఉంది)గా నిర్వహించడానికి అంగీకరించిన పాకిస్తాన్.. ఈ ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో కూడా తమకు ఇలాంటి ఆప్షనే ఉండాలని పట్టుబడుతున్నది.
భారత్ పాక్ కు రానప్పుడు తమ జట్టు అక్కడికి ఎందుకు వెళ్లాలి..? అన్న పట్టుదలలో ఉన్న పాకిస్తాన్.. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా తాము ఆడబోయే మ్యాచ్ లను బంగ్లాదేశ్ లో ఆడించాలని ఐసీసీకి లేఖ రాసినట్టు సమాచారం. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) లో చర్చలు జోరుగా సాగుతున్నాయని, ఈ విషయంలో తమ వాదనను గట్టిగా వినిపించేందుకు పీసీబీ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
ఆసియా కప్ మోడల్ నే వన్డే వరల్డ్ కప్ లో తమకూ వర్తింపజేయాలని పీసీబీ పట్టుబట్టే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. అలా జరిగితే పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్ లు అన్నీ తటస్థ వేదికపైనే జరుగుతాయి. అది ఐసీసీ తో పాటు బీసీసీఐకి కూడా ఇబ్బందికర పరిస్థితే. కాగా దీనిపై ఐసీసీ స్పందిస్తూ.. వివిధ దేశాలు ఆడే టోర్నీలో ఒక్క దేశం (పాకిస్తాన్) కోసం వేదకలను మార్చడం సబబు కాదని సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
ఆసియా కప్ కోసం భారత్ పాక్ కు రాకపోవడంపై ఆగ్రహంగా ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్లు, పీసీబీ బోర్డు సభ్యులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ప్రతిపాదనకు పీసీబీ అంగీకరించి ఉండకూడదన్న వాదనలూ వినిపించాయి. ఇదే అదునుగా భారత్ ను ఇరకాటంలో పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఆ దేశ మాజీలు టీమిండియాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు.
కానీ తాటాకు చప్పుళ్లకు బీసీసీఐ భయపడే రకమేనా..? కంటిసైగతో ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న బీసీసీఐ.. తలుచుకుంటే ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ను నామరూపాల్లేకుండా చేయగలిగే సత్తా దానికి ఉంది. ఈ విషయాన్ని స్వయంగా పీసీబీ మాజీ అధ్యక్షుడు (రమీజ్ రాజా) ఓ సందర్భంలో చెప్పాడు. అన్నీ తెలిసి కూడా పీసీబీ ఈ పిల్లిమొగ్గలు వేయడం ఆ జట్టుకే చేటు కలిగిస్తుందన్నది విశ్లేషకుల వాదన.