- Home
- Sports
- Cricket
- ఆ రోజు మేం గెలవడానికి రహానే కారణం, కోహ్లీని రనౌట్ చేయకపోతే... ఆడిలైడ్ టెస్టుపై టిమ్ పైన్ కామెంట్...
ఆ రోజు మేం గెలవడానికి రహానే కారణం, కోహ్లీని రనౌట్ చేయకపోతే... ఆడిలైడ్ టెస్టుపై టిమ్ పైన్ కామెంట్...
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారీ అంచనాలతో ఆస్ట్రేలియా టూర్కి వెళ్లింది భారత జట్టు. అయితే ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోర పరాభవాన్ని చవి చూసింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ పరాజయం ఓ మాయని మచ్చ... ఈ మ్యాచ్పై మరోసారి స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్...

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పృథ్వీషా డకౌట్ కాగా మయాంక్ అగర్వాల్ 17, ఛతేశ్వర్ పూజారా 43 పరుగులు చేయగా 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అజింకా రహానేతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ కావడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపింది...
రన్ కోసం పిలుపు ఇచ్చిన అజింకా రహానే, ఆ తర్వాత కొన్ని సెకన్లలో వెనక్కి వెళ్లడంతో అప్పటికే సగం క్రీజు దాటిన విరాట్ కోహ్లీ రనౌట్ అయ్యి... నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకి ఆలౌట్ కావడంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్లో 53 పరుగుల ఆధిక్యం దక్కింది...
డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఆధిక్యం సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచి, పాజిటివ్ ఎనర్జీతో రెండో ఇన్నింగ్స్ని మొదలెట్టిన టీమిండియా... 45 నిమిషాల్లోనే కుప్పకూలింది. 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మహ్మద్ షమీ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరడంతో 36/9 వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ తెరపడింది...
భారత జట్టులో ఏ బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు. 9 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జోష్ హజల్వుడ్ 5, ప్యాట్ కమ్మిన్స్ 4 వికెట్లు తీసి భారత జట్టు పతనాన్ని శాసించారు...
91 పరుగుల టార్గెట్ని 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఈ ఘోర పరాభవానికి తొలి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీని రనౌట్ చేసిన అజింకా రహానేని కారణమని ట్రోల్స్ వినిపించాయి. కోహ్లీని రనౌట్ చేయకపోతే భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కి ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు అభిమానులు..
‘అవును... విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20-30 పరుగుల వద్ద ఉన్నప్పుడు అనుకుంటా... లైటింగ్ పోయింది. ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అయితే విరాట్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు...
విరాట్ కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మాకు నష్టం జరుగుతుందని అనుకున్నా. మ్యాచ్ గడిచేకొద్దీ విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకుపోతున్నాడు. మరో ఎండ్లో రహానే కూడా బాగా ఆడుతున్నాడు...
ఇద్దరూ కలిసి చక్కగా ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. లక్కీగా రహానే, కోహ్లీని రనౌట్ చేశాడు. మా వరకూ అదే గేమ్ ఛేజింగ్ మూమెంట్. అప్పటిదాకా మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోతుందనే భయపడ్డాం. అయితే కోహ్లీ అవుట్ అయ్యాక మాలో నమ్మకం పెరిగింది..
ఎందుకంటే విరాట్ కోహ్లీ బెస్ట్ ప్లేయర్. అతన్ని అవుట్ చేస్తే మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అనుకున్నట్టే కోహ్లీ అవుట్ అయ్యాక మ్యాచ్ మా చేతుల్లోకి వచ్చేసింది... ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే...’ అంటూ ‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీలో కామెంట్ చేశాడు టిమ్ పైన్...
ఆడిలైడ్ టెస్టులో టీమిండియా చిత్తు చేసి టెస్టు సిరీస్లో బోణీ కొట్టింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేయడంలో అజింకా రహానే కెప్టెన్సీలో సిరీస్ కొనసాగింది. మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసి భారత జట్టుకి విజయాన్ని అందించాడు అజింకా రహానే...
సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా పోరాడి, భారత జట్టుకి చారిత్రాత్మక డ్రా అందించారు. బ్రిస్బేన్లో జరిగిన నాలుగో టెస్టులో ఆఖరి రోజు శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, పూజారా ఇన్నింగ్స్లతో ఘన విజయాన్ని అందుకుని 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆసీస్కి ఓటమిని పరిచయం చేసింది భారత జట్టు...
సీనియర్లు లేకుండా, కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైనా ఆస్ట్రేలియాను గబ్బా టెస్టులో ఓడించి, 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా... భారత క్రికెట్ చరిత్రలో ఈ సిరీస్ విజయం చాలా ప్రత్యేకమైనదిగా చిరస్థాయిగా మిగిలిపోయింది...