- Home
- Sports
- Cricket
- కెఎల్ రాహుల్కు బహుమతులుగా బంగ్లాలు, కార్లు.. అన్నీ పుకార్లే అంటున్న సునీల్ శెట్టి ఫ్యామిలీ..
కెఎల్ రాహుల్కు బహుమతులుగా బంగ్లాలు, కార్లు.. అన్నీ పుకార్లే అంటున్న సునీల్ శెట్టి ఫ్యామిలీ..
KL Rahul - Athiya Shetty: జనవరి 23న సునీల్ శెట్టికి ఖండాలాలో ఉన్న ఫామ్ హౌస్ లో రాహుల్-అతియా శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక ముగిసింది.

టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఇటీవలే బాలీవుడ్ నటి అతియా శెట్టిని ఖండాలా (ముంబై) లో అతికొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా లవ్ లో ఉన్న వీరిద్దరూ జనవరి 23న వివాహబంధంతో ఒక్కటయ్యారు.
అయితే పెళ్లి సందర్భంగా కెఎల్ రాహుల్ కు సునీల్ శెట్టి ముంబై మహానగరంలో రూ. 50 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్ గిఫ్ట్ గా ఇచ్చాడని.. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రూ. 1.64 కోట్ల ఆడి కార్ బహుమతిగా ఇచ్చారని వార్తలు వచ్చాయి.
భారత క్రికెట్ మాజీ సారథులు విరాట్ కోహ్లీ.. రాహుల్ కు రూ. 2.17 కోట్లు విలువ చేసే ఖరీదైన కారును, మహేంద్ర సింగ్ ధోని రూ. 80 లక్షల కవాసకీ నింజా బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చారని కూడా పలు జాతీయ మీడియాలలో, సోషల్ మీడియాలో పుంకానుపుంకాలుగా కథనాలు వచ్చాయి. అయితే అటు రాహుల్ గానీ, ఇటు అతియా శెట్టి ఫ్యామిలీ గానీ దీని మీద అధికారిక ప్రకటన చేయలేదు.
తాజాగా ఈ రూమర్స్ గిఫ్ట్స్ పై సునీల్ శెట్టి ఫ్యామిలీ స్పందించింది. అవన్నీ పుకార్లే అని తేల్చేసింది. ఏబీపీ న్యూస్ కు సునీల్ శెట్టి ఫ్యామిలీ వర్గాలు చెప్పిన సమాచారం మేరకు.. ‘సోషల్ మీడియాతో పాటు పలు ఛానెళ్లలో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవం. అవి కట్టుకథలు. మీద్వారా మీడియా అంతటికీ చెప్పే విషయమేంటంటే.. దయచేసి ఇలాంటివి ప్రసారం చేసేప్పుడు మమ్మల్ని సంప్రదించండి. మమ్మల్ని అడిగిన తర్వాత ఇలాంటి కథనాలను రాసుకోండి..’ అని తెలిపాయి.
కాగా జనవరి 23న సునీల్ శెట్టికి ఖండాలాలో ఉన్న ఫామ్ హౌస్ లో రాహుల్-అతియా శెట్టిల వివాహం ఘనంగా జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక ముగిసింది. రాహుల్-అతియాల రిసెప్షన్ వేడుక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఉండొచ్చని సమాచారం.
పెళ్లి తంతు ముగిసిన వెంటనే రాహుల్ భారత జట్టుతో కలవనున్నాడు. వచ్చే నెల ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఈ సిరీస్ కోసం రాహుల్.. పెళ్లి ముగిసిన రెండ్రోజులకే భార్యను వదిలి టీమ్ తో చేరడానికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 9 నుంచి జరుగబోయే టెస్టు సిరీస్ కు ముందు టెస్టు సిరీస్ లో ఎంపికైన భారత ఆటగాళ్లతో బీసీసీఐ వర్క్ షాప్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా అతడు జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నాడు.