- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ వల్ల పెద్దగా నష్టం లేదా..? దేశానికి ఆడకపోవడానికి ఇదొక సాకు.. భారత క్రికెటర్లపై గవాస్కర్ ఫైర్
ఐపీఎల్ వల్ల పెద్దగా నష్టం లేదా..? దేశానికి ఆడకపోవడానికి ఇదొక సాకు.. భారత క్రికెటర్లపై గవాస్కర్ ఫైర్
IPL 2023: మూడు రోజుల క్రితం మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో దాదాపు అన్ని జట్లు ఒక్క మ్యాచ్ ఆడాయి. పది ఫ్రాంచైజీలలోనూ భారత జాతీయ జట్టుతో ఆడే ఆటగాళ్లున్నారు.

ఐపీఎల్ అనగానే గాయాలను దాచి మరి ఆడే పలువురు క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల పాటు జరిగే ఈ సీజన్ లో ఆడమంటే పూనకం వచ్చినట్టు ఆడుతూ జాతీయ జట్టుకు మాత్రం అంటీముట్టనంటు ఉండే క్రికెటర్లపై ఆయన విమర్శలు గుప్పించాడు.
ఈ ఏడాది భారత్.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేండ్లు (2013) కావొస్తున్నా మళ్లీ కప్ కొట్టకపోవడం అటు అభిమానులతో పాటు ఇటు బోర్డు, ఆటగాళ్లకు అసహనం తెప్పిస్తున్నది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ గానీ వన్డే వరల్డ్ కప్ లో గానీ టైటిల్ సాధించడం భారత్ కు అత్యావశ్యకం.
కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందే భారత ఆటగాళ్లలో దాదాపు సగానికంటే ఎక్కువ మంది ఐపీఎల్ లో భాగమయ్యారు. ఇది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇలా ఒక్క పుజారా తప్ప దాదాపు అందరూ ఐపీఎల్ లో ఆడుతున్నవాళ్లే.
ఈ సీజన్ లో ఏదైనా జరుగరానిది జరిగి గాయాలైతే అది మొదటికే మోసం. ఇప్పటికే రోడ్డు ప్రమాదం వల్ల రిషభ్ పంత్, వెన్ను గాయం వల్ బుమ్రాలతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా రాబోయే నాలుగైదు నెలలు క్రికెట్ కు దూరంగా ఉండనుండగా ఉన్న వాళ్లైనా గాయాల బారిన పడకుండా ఫిట్నెస్ కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కానీ మనోళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుతుండటంపై గవాస్కర్ స్పందించాడు.
మిడ్ డే కు రాసిన వ్యాసంలో గవాస్కర్ స్పందిస్తూ... ‘ఐపీఎల్ కు ముందు రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముంబై హెడ్ కోచ్ మార్క్ బౌచర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ వల్ల పెద్దగా వర్క్ లోడ్ ఏం ఉండదని అన్నాడు. 20 ఓవర్ల గేమ్ వల్ల ఆటగాళ్లు పెద్దగా అలిసిపోరని తెలిపాడు. బౌచర్ సమాధానం నాకు వింతగా అనిపించింది. 15 ఏండ్ల క్రితం ఐపీఎల్ మొదలైనప్పుడు క్రికెటర్ల సంఘాల నుంచి ఈ లీగ్ వల్ల నష్టాలు వాటిల్లుతాయని వ్యతిరేకత ఎదురైంది.
కానీ కొద్దిరోజులకు ఇందులో పరమార్థం (డబ్బు) అర్ధమైన తర్వాత ఆటగాళ్ల ఆలోచనలు చాలామారాయి. క్రికెటర్లే కాదు.. ప్లేయర్ల ఆర్గనైజేషన్స్ కూడా నోరెత్తడం లేదు. అయితే ఈ లీగ్ లో ఆడేందుకు గాను ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడేప్పుడు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను కారణంగా చూపి తప్పించుకుంటున్నారు. ఈసారి గనక ఇండియా వరల్డ్ కప్ గెలవకుంటే చాలా మంది క్రికెటర్ల కెరీర్ లు ముగిసిపోతాయి...’అని పేర్కొన్నాడు.