57 మంది ప్లేయర్లు, రూ.145.3 కోట్లు.... ఐపీఎల్ వేలంలో భారీ హిట్టర్లకు నిరాశ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో 293 మంది క్రికెటర్లు పాల్గొనగా, అందులో 57 మందికి మాత్రం ఐపీఎల్ సీజన్ 14 ఆడే అవకాశం దక్కనుంది. మిగలిన 136 మంది ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్ 2021 మినీ వేలంలో అన్ని జట్లు కలిసి రూ.145.3 కోట్లు ఖర్చు చేశాయి.
ఐపీఎల్ మినీ వేలంలో 57 మంది ప్లేయర్లకు ఎనిమిది జట్లు కొనుగోలు చేయగా వీరిలో 22 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నాయి. 29 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఈసారి ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నారు.
ఐపీఎల్ వేలం చరిత్రలోనే మొట్టమొదటిసారి నలుగురు ప్లేయర్లు రూ.14 కోట్లకు పైగా ధర దక్కించుకోగలిగారు. క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లు దక్కించుకుని యువరాజ్ రూ.16 కోట్ల రికార్డు బ్రేక్ చేయగా, కేల్ జెమ్మీసన్ రూ.15 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ రూ.14.25 కోట్లు, జే రిచర్డ్సన్ రూ. 14 కోట్లు దక్కించుకున్నారు.
అయితే ఐపీఎల్ మినీ వేలంలో భారీ హిట్టర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. బిగ్బాష్ లీగ్ 2021 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచిన ఆలెక్స్ హేల్స్ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. రూ. కోటిన్నర్ బేస్ ప్రైజ్తో వేలానికి వచ్చిన హేల్స్కి నిరాశే ఎదురైంది.
వరల్డ్కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ను కూడా ఏ జట్టూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అతని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. ‘ఐపీఎల్లో నన్ను ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడం సిగ్గుగా ఉంది. అయితే లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న ప్లేయర్లకు నా అభినందనలు’ అంటూ తెలిపాడు జేసన్ రాయ్.
ఆస్ట్రేలియా యంగ్ వికెట్ కీపర్ ఆలెక్స్ క్యారీ, ఎవిన్ లూయిస్, గ్లెన్ ఫిలిప్స్, వెస్టిండీస్ బౌలర్ షెల్డ్రెన్ కాంట్రెల్, శ్రీలంక ప్లేయర్ కుశాల్ పెరేరా, అదిల్ రషీద్, ఇష్ సోదీ, షాన్ మార్ష్, రోవ్మన్ పోవెల్, కోరీ అండర్సన్ వంటి భారీ హిట్టర్లను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు...
న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గుప్టిల్, మొదటిసారి ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించిన ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్లతో పాటు రస్సీ వాన్ డే దుస్సేన్, మిచెల్ మెక్క్లెనగన్, మాథ్యూ వేడ్ వంటి ప్లేయర్లకు నిరాశే ఎదురైంది.
గత ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని తెలుగు కుర్రాడు హనుమ విహారికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారాను సీఎస్కే కొనుగోలు చేయగా, విహారిని మాత్రం ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక్క శ్రీలంక ప్లేయర్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అద్భుతంగా రాణించిన కేదార్ దేవ్ధర్, తుషార్ దేశ్పాండే, విష్ణు సోలంకి, హిమాన్షు రాణా వంటి ప్లేయర్లకు కూడా ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురైంది.
గత ఏడాది ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్కి ఈసారి వేలంలో నిరాశే ఎదురైంది. ఫించ్ను కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు.
బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫికర్ రహీమ్కి మరోసారి ఐపీఎల్ వేలంలో నిరాశే ఎదురైంది. వేలంలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బంగ్లా ‘టైగర్’ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ముందుకు రాలేదు. 14 సీజన్లుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్లేయర్గా అరుదైన చెత్త రికార్డు నెలకొల్పాడు రహీమ్.