ప్లేయర్లే లేరన్నారు! ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కోసం 1500 మంది... అమ్మాయిలా! మజాకా...
బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకం తీసుకుని ప్రారంభిస్తున్న లీగ్ డబ్ల్యూపీఎల్ (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్). ఈ ఏడాది ప్రారంభమయ్యే ఈ లీగ్కి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ వచ్చింది. మీడియా హక్కులను అమ్మేసిన బీసీసీఐ, మొదటి సీజన్లో ఐదు ఫ్రాంఛైజీలు పోటీపడబోతున్నట్టు కూడా ప్రకటించింది...
మెన్స్ ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని తీసుకొస్తోంది బీసీసీఐ. ఉమెన్స్ ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్న ఎదురైన ప్రతీసారి, లీగ్ నిర్వహించేందుకు కావాల్సినంత మంది ప్లేయర్లు దొరకాలి కదా? అంటూ తప్పించుకుంటూ వచ్చారు బోర్డు పెద్దలు...
అయితే మొట్టమొదటి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం కోసం ఏకంగా 1500 మంది మహిళా క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నట్టు సమాచారం. ఇది మెన్స్ ఐపీఎల్ కంటే అధికం... మెన్స్ ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం 991 మంది రిజిస్టర్ చేయించుకోగా వీరిలో నుంచి 195 మందిని షార్ట్ లిస్ట్ చేశాయి ఫ్రాంఛైజీలు...
మహిళల ప్రీమియర్ లీగ్కి 1500 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోవడం, ఫ్రాంఛైజీలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కో ఫ్రాంఛైజీ 15 నుంచి 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేసినా ఐదు ఫ్రాంఛైజీలకు కలిపి మొత్తంగా కావాల్సింది 90 మంది ప్లేయర్లే..
స్వదేశీ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు కూడా మహిళా ప్రీమియర్ లీగ్లో ఆడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో దేశవాళీ టోర్నీలు ఆడుతున్న అమ్మాయిలు కూడా ఉమెన్స్ ఐపీఎల్ వేలం కోసం రిజిస్టర్ చేయించుకున్నారు...
ప్లేయర్లు లేరని ఐదు ఫ్రాంఛైజీలతో సరిపెట్టిన బీసీసీఐకి ఇది ఊహించని షాకే. తొలి సీజన్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, లక్నో వారియర్స్ టీమ్స్ బరిలో దిగబోతున్నాయి...
ప్రతీ ఫ్రాంఛైజీ రూ.12 కోట్ల పర్సు వాల్యూతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటుంది. రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో ప్లేయర్లు వేలంలోకి రాబోతున్నారు..