బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ : కేవైసీ అప్డేట్ పేరుతో మెసేజ్ వచ్చిందా..? క్లిక్ చేస్తే అంతే..
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల..? అయితే మీ కోసం ఒక ముఖ్యమైన సమాచారం. తాజాగా చైనాకి చెందిన హ్యాకర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఉచిత బహుమతుల పేరుతో ఫిషింగ్ మోసాలకు పాల్పడుతున్నారు.
ఒక నివేదిక ప్రకారం, ఒక వెబ్సైట్ లింక్ను ఉపయోగించి బ్యాంక్ అక్కౌంట్ కెవైసిని అప్డేట్ చేయమని హ్యాకర్లు ఎస్బిఐ వినియోగదారులకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తు, బ్యాంకు నుంచి రూ .50 లక్షల విలువైన ఉచిత బహుమతుల పేరుతో ఆఫర్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరించారు.
న్యూ ఢీల్లీకి చెందిన థింక్ ట్యాంక్ సైబర్ పీస్ ఫౌండేషన్ పరిశోధనా విభాగం ఆటోబోట్ ఇన్ఫోసెక్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఎస్బిఐ పేరు మీద ఫిషింగ్ మోసాలపై అలెర్ట్ చేసింది.
కేవైసి ధృవీకరణ చేయమని చూపించే మెసేజ్ పేజీ అధికారిక ఎస్బిఐ ఆన్లైన్ పేజీ లాగానే ఉంటుందిని తెలిపింది."కంటిన్యూ లాగిన్" బటన్పై క్లిక్ చేసినప్పుడు, అది ఆన్లైన్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవ్వడానికి వినియోగదారుల పేరు, పాస్వర్డ్, క్యాప్చా వంటి సీక్రెట్ సమాచారాన్ని అడుగుతూ వినియోగదారుని ఫుల్-కేవైసి.పిహెచ్పి పేజీకి మళ్ళిస్తుంది.
"దీనిని అనుసరించి, యూజర్ మొబైల్ నంబర్కు పంపిన ఓటిపిని అడుగుతుంది. ఓటిపి ఎంటర్ చేసిన వెంటనే వినియోగదారుడిని మరొక పేజీకి మళ్ళిస్తుంది, తరువాత ఖాతాదారుడి పేరు, మొబైల్ నంబర్, తేదీ వంటి సమాచారాన్ని మళ్ళీ ఎంటర్ చేయమని వినియోగదారులను అడుగుతుంది. ఎంటర్ చేసిన తరువాత వినియోగదారుడిని ఓటిపి పేజీకి మళ్ళిస్తుంది "అని పరిశోధకులు తెలియజేశారు.
ఈ వెబ్ పేజీ మొత్తం లేఅవుట్ వినియోగదారులను ఆకర్షించడానికి అధికారిక ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ సైట్ లాగా ఉండేలా రూపొందించారు.అయితే ఈ నివేదికపై ఎస్బిఐ అధికారికంగా స్పందించలేదు."ల్యాండింగ్ పేజీలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన ఫోటోతో మెసేజ్ కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 50 లక్షల రూపాయల ఉచిత బహుమతిని పొందడానికి సర్వేలో పాల్గొనమని వినియోగదారులను కోరుతుంది" అని పరిశోధకులు సమాచారం ఇచ్చారు.
సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఇటువంటి మెసేజులను ప్రజలు క్లిక్ చేయకుండా లేదా ఇతరులకు షేర్ చేయకుండా ఉండాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. ఇంతకుముందు ఏప్రిల్లో కూడా ఇలాంటి ఓటిపి కుంభకోణంపై ఎస్బిఐ తన వినియోగదారులను హెచ్చరించింది.మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఎస్బిఐ ట్వీట్ చేస్తూ ప్రజలను మోసం చేయడానికి హ్యాకర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు అని బ్యాంక్ తెలిపింది.