Rupee All Time Low: రూపాయి విలువ పడిపోతే దేశానికి ఏమవుతుంది..ఏమేం ధరలు పెరుగుతాయి...
Rupee All Time Low: డాలర్ కు ప్రతిగా రూపాయి విలువ భారీగా క్షీణించింది. దీంతో దీని ప్రత్యక్ష ప్రభావం పలు రంగాలపై నేరుగా పడనుంది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల మేర క్షీణించింది. ముఖ్యంగా చమురు ధరలతో పాటు నిత్యవసరాలు సైతం భారీగా పెరుగుతాయని నిపుణుల అంచనా వేస్తున్నారు.

Rupee All Time Low: దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమవుతోంది. డాలరు మారకంతో పోల్చితే రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అమెరికా డాలరుతో పోలిస్తే 52 పైసల మేర క్షీణించింది. ప్రస్తుతం అమెరికన్ డాలరుకు ప్రతిగా 77.42 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో అమెరికా డాలర్తో రూపాయి 49 పైసలు క్షీణించి 77.41 వద్దకు చేరుకుంది. ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకు రుణాలు ఖరీదుగా మారడం, విదేశీ ఇన్వెస్టర్ల స్టాక్ మార్కెట్లో అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మధ్య సోమవారం కరెన్సీ మార్కెట్లో బలహీనత నెలకొంది.
డాలర్ ఖరీదు ప్రభావం ఎలా ఉంటుంది
పెట్రోల్, డీజిల్ మరింత పెరిగే చాన్స్..
ప్రపంచంలో ఇంధనాన్ని వినియోగించే రెండవ అతిపెద్ద దేశం భారత్. మన దేశ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల చమురు దిగుమతుల ద్వారానే సమకూరుతుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) డాలర్లలో చెల్లించి ముడి చమురును కొనుగోలు చేస్తాయి. రూపాయితో పోలిస్తే డాలరు ఖరీదు పెరిగింది. దీంతో రూపాయి విలువ క్షీణిస్తే, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు చెల్లించవలసి ఉంటుంది. దీనివల్ల దిగుమతులు ఖరీదు పెరిగి, సాధారణ వినియోగదారులు పెట్రోల్, డీజిల్ కోసం అధిక ధర చెల్లించవలసి ఉంటుంది.
నిత్యవసరాల ధరలు పెరిగే చాన్స్..
రూపాయి విలువ క్షీణించి డాలర్ ఖరీదు పెరిగితే ఆ ప్రభావం ద్రవ్యోల్బణం మీద పడుతుంది. ఫలితంగా దిగమతి చేసుకునే అన్ని వస్తువుల మీద కూడా భారం పడుతుంది. ఫలితంగా ఇంధనం ధరలు పెరిగితే వాటి ప్రభావం రవాణాపై పడుతుంది. ఫలితంగా కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
విదేశీ విద్య మరింత భారం..
భారతదేశం నుండి లక్షలాది మంది పిల్లలు విదేశాలలో చదువుతున్నారు, వారి తల్లిదండ్రులు ఫీజు నుండి జీవన ఖర్చుల వరకు చెల్లిస్తున్నారు. విదేశాల్లో వారి చదువు ఖరీదు అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ డబ్బు చెల్లించి డాలర్లు కొనవలసి ఉంటుంది, తద్వారా వారు ఫీజు చెల్లించవచ్చు. దీని కారణంగా వారు ద్రవ్యోల్బణం షాక్కు గురవుతారు. జూన్ నెల నుంచి ఆగస్టు వరకు విదేశీ అడ్మిషన్లు ప్రారంభం కావడంతో డాలర్లకు ఎలాగూ డిమాండ్ పెరుగుతుంది. ఖరీదైన డాలర్ భారాన్ని తల్లిదండ్రులు భరించాల్సి ఉంటుంది.
వంటనూనెల ధరలు మరింత పెరిగే చాన్స్...
వంటనూనెలు ఇప్పటికే ఖరీదుగా మారాయి. డాలర్ ఖరీదు పెరగడంతో, సన్ ఫ్లవర్ లాంటి వంట నూనెలను దిగుమతి చేసుకోవడం మరింత ఖరీదుగా మారుతుంది. ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఎక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో సామాన్యులు పామాయిల్ సహా ఇతర వంట నూనెల కోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది.
విదేశాలకు వెళ్లే వారికి షాక్
విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న పెరిగిన డాలర్ విలువ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే డాలర్ కోసం ఎక్కువ రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడం మరింత ఖరీదు అవుతుంది. అదేవిధంగా, కరోనా కారణంగా ట్రావెల్ పరిశ్రమ ఇప్పటికే పెను సంక్షోభంలో ఉంది.
విదేశీ రుణాలకు వడ్డీలు పెరుగుతాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీలను చెల్లించేందుకు, డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ రుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.