త్వరలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బిగ్ డీల్.. 20 శాతం వాటాను దక్కించుకునేందుకు చర్చలు..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీ సౌదీ ఆరామ్కో మధ్య ఒప్పందం త్వరలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సౌదీ అరామ్కో రిలయన్స్ ఇండస్ట్రీస్లో 25 బిలియన్ డాలర్ల వాటా(సుమారు 20 శాతం)ను దక్కించుకునేందుకు చర్చలు జరుపుతుంది.
ఈ వార్త తర్వాత నేడు రిలయన్స్ షేర్లు ఏకంగా 2.6 శాతం మేర లాభాపడ్డాయి. ఈ రోజు 2149.35 స్థాయిలో ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1.18 గంటలకు రిలయన్స్ స్టాక్ 2192.35 స్థాయిలో 2.18 శాతం పెరిగింది. గత రోజు 2145.65 స్థాయిలో ముగిసింది.
బ్లూమ్బెర్గ్ ప్రకారం దేశంలోని అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఆయిల్ ఆర్మ్లో దాదాపు 20 శాతం వాటా కోసం ఆరామ్కో చర్చలు జరుపుతోంది. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం రాబోయే వారాల్లో ఈ ఒప్పందం జరగవచ్చు.ఈ డీల్ ప్రకారం ఏడ్నాక్, రిలయన్స్ సంయుక్తంగా క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్, పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) ని ఉత్పత్తి చేయనున్నాయి. దీనికి సంబంధించి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఓసి) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ 2019 ఆగస్టులో ప్రపంచంలోని అతి పెద్ద చమురు ఎగుమతిదారి సౌదీ ఆరామ్కో రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో (O2C) 20 శాతం వాటా కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం 2020 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది, కానీ ఆలస్యం అయింది. అయితే ఆలస్యనికిగల కారణలను మాత్రం వెల్లడించలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో సౌదీ ఆరామ్కో ఛైర్మన్
సౌదీ అరేబియా చమురు కంపెనీ ఆరామ్కో చైర్మన్ యాసిర్ అల్ రుమాయెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 4వ ఏజిఎంలో పాల్గొన్నారు. ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్గా సమావేశానికి హాజరయ్యారు. ఏజిఎంలో ముకేశ్ అంబానీ, యాసిర్ అల్ రుమయన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డులో చేర్చినట్లు ప్రకటించారు. ముఖేష్ అంబానీ, 'సౌదీ ఆరామ్కో ఛైర్మన్ అండ్ పిఐఎఫ్ గవర్నర్ యాసిర్ అల్-రుమాయెన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా చేరుతున్నందుకు నేను స్వాగతం పలుకుతున్నాను' అని అన్నారు. రిలయన్స్ అంతర్జాతీయీకరణకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులోని 14 మంది సభ్యులలో సగం మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు. వీరిలో ఎస్బిఐ మాజీ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య, మెకిన్సే ఇండియా మాజీ చీఫ్ అదిల్ జైనుల్భాయ్, సిఎస్ఐఆర్ మాజీ చీఫ్ ఆర్ఏ మశెల్కర్ ఉన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైపి త్రివేది ఈ సంవత్సరం బోర్డు నుండి రిటైర్ అయ్యారు.