రియల్ ఎస్టేట్ రంగంపై మళ్ళీ కరోనా ఎఫెక్ట్.. గృహ అమ్మకాలపై మళ్ళీ ఎదురుదెబ్బ.. ?
గత సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా దేశంలోని ఏడు, ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ అమ్మకాలు 40 నుండి 50 శాతం పడిపోయాయి. కోవిడ్ -19 సెకండ్ వేవ్ ని అరికట్టడానికి మరోసారి లాక్డౌన్ అమలు చేయకపోతే ఇళ్ల అమ్మకాలు మళ్లీ 2019 స్థాయిని తాకవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.
జనవరి-మార్చి త్రైమాసికంలో గృహ అమ్మకాల వృద్ధి
రియాల్టీ కంపెనీల ప్రధాన సంస్థ క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో గృహ అమ్మకాలు కాస్త పెరిగాయి, ఈ ధోరణి ఊహించినట్లుగా కొనసాగితే రాబోయే తొమ్మిది నెలల్లో అమ్మకాలు ఊపందుకుంటాయి అని తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ గురించి
కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ పై హర్షవర్ధన్ పటోడియా ఆందోళన వ్యక్తం చేస్తూ, దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి క్రెడాయ్ అధ్యక్షుడిగా హర్షవర్ధన్ పటోడియా బాధ్యతలు స్వీకరించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి అడిగినప్పుడు నైట్ ఫ్రాంక్ ఇండియా డేటా ప్రకారం, జనవరి-మార్చి త్రైమాసికంలో గృహ అమ్మకాలు 44 శాతం పెరిగాయని అన్నారు. కరోనా వ్యాప్తి పెరగాకుండ, ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా ఉంటే అమ్మకాలు మళ్లీ 2019 స్థాయికి తిరిగి చేరుకుంటాయని అన్నారు.
నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకారం, ఎనిమిది నగరాల్లో 2020లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ సేల్స్ 37 శాతం తగ్గి 1,54,534 యూనిట్లకు చేరుకున్నాయి, అంతకుముందు సంవత్సరంలో ఇది 2,45,861 యూనిట్లుగా ఉంది.
కరోనా వ్యాప్తి కారణంగా భారతదేశంలోని 56 ప్రధాన మార్కెట్లలో గృహాల ధరలు అత్యల్పంగా ఉన్నాయి. అలాగే 2020 డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో గృహాల ధరలు 3.6 శాతం తగ్గాయి. భారతదేశంలో రియాల్టీ మార్కెట్ బలహీనమైన పనితీరు కారణంగా ఏడాది క్రితం ఉన్న 43వ స్థానం నుండి 56వ స్థానంలో పడిపోయింది. ఒక నివేదిక ప్రకారం టర్కీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.