త్వరలో ఇంటర్నెట్ లేకుండా కూడా డిజిటల్ చెల్లింపులు.. ఐఎంపిఎస్ పరిమితి పెంపు: ఆర్బిఐ
డిజిటల్ లావాదేవీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కొత్త రూపాన్ని ఇచ్చాయి. అంతేకాదు డిజిటల్ లావాదేవీలు వచ్చినప్పటి నుండి చెల్లింపుల రంగంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలతో చాలా సౌలభ్యం కూడా ఉంది.
అలాగే ప్రజలు డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన పనిని మరింత ఈజీగా చేయవచ్చు. దేశంలోని రిటైల్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా దీనివల్ల చాలా ప్రయోజనం పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు ఒక పెద్ద ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం రాబోయే రోజుల్లో దేశ ప్రజలు ఇంటర్నెట్ లేకుండా కూడా మొబైల్ నుండి డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ చాలా తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు దీనివల్ల పెద్ద ప్రయోజనం లభిస్తుంది. అంతే కాకుండా ఆర్బిఐ కొన్ని ఇతర ప్రకటనలు కూడా చేసింది. వాటి గురించి తెలుసుకుందాం..
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరి పాలసీ కమిటీ సమావేశం నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. మరోవైపు బ్యాంక్ రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా యధాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఇమ్మిడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపిఎస్) ద్వారా ఆన్లైన్ చెల్లింపు పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచారు. రిటైల్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు దీని వల్ల చాలా పెద్ద ప్రయోజనం ఏర్పడుతుంది. దీని సహాయంతో ఇప్పుడు మరింత పెద్ద మొత్తాన్ని మరొక వ్యక్తి ఖాతాకు తక్షణమే పంపగలరు. ఇమ్మెడియెట్ పేమెంట్ సర్వీస్ (IMPS) వివిధ ఛానెల్ల ద్వారా 24x7 ఇన్స్టంట్ ఫండ్ ట్రాన్సఫర్ సౌకర్యాన్ని అందిస్తుంది.
ఈ విషయాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ త్వరలో దేశంలో ఇంటర్నెట్ లేకుండా చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ వ్యాప్తి చాలా తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు డిజిటల్ చెల్లింపులను అందించడం దీని ముఖ్య లక్ష్యం. అలాగే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ కల సాకారం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఎస్ఎంఎస్, ఐవిఆర్ఎస్ ద్వారా ఐఎంపిఎస్ సేవలను యాక్సెస్ చేయడానికి ప్రతి లావాదేవీకి పరిమితి రూ.5,000 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్ల ద్వారా పేమెంట్ అక్సెప్టెన్స్ (PA) అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్బిఐ జియో-ట్యాగింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.
ఈ నెల ప్రారంభం నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివైసేడ్ ఆటో డెబిట్ నియమాలు అమలులోకి వచ్చాయి. కొత్త ఆటో డెబిట్ నిబంధనల ప్రకారం క్రెడిట్, డెబిట్ కార్డ్ల ద్వారా రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన పేమెంట్ షెడ్యూల్ చేసిన పేమెంట్ గురించి వినియోగదారులకు 24 గంటల ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయాలి.
గత సంవత్సరం డిసెంబర్లో భారీ లావాదేవీల కోసం ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (RTGS) 24x7 అందుబాటులోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే.