ముగిసిన ఎంపిసి సమావేశం: ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య కీలక వడ్డీ రేట్లను ప్రకటించిన ఆర్బిఐ..
అక్టోబర్ 6న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరి పాలసీ కమిటీ (MPC) సమావేశం నేడు ముగిసింది. కరోనా రెండవ వేవ్ కారణంగా ఏప్రిల్, మేలో దేశంలోని అనేక ప్రాంతాల్లో విధించిన కఠినమైన ఆంక్షల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది.
కానీ ఇప్పుడు ఆంక్షలు పూర్తిగా సడలించబడ్డాయి. దీంతో ఈ సమావేశం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరి పాలసీ కమిటీ ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు చర్చించబడతాయి అలాగే వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా పాలసీ రేట్లను 22 మే 2020 న సవరించింది.
కీలకమైన నిర్ణయాలు:
ఆర్బిఐ వరుసగా ఎనిమిదోసారి కూడా రెపో రేటును యధావిధిగా కొనసాగించింది. ప్రస్తుతం 4 శాతంగానే ఉంది. అంటే ఈఎంఐ లేదా రుణ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొత్త ఉపశమనం లభించలేదు.
మానిటరి పాలసీ కమిటీ సభ్యులందరూ రేపో రేట్లను కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నారని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉంది.
రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగా స్థిరంగా ఉంచామని దాస్ చెప్పారు.
దీనితో పాటు బ్యాంక్ రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. అంటే 4.25 శాతంగా ఉంది.
సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని 'మితంగా' ఉంచింది.
ఆర్థిక వ్యవస్థలో కోలుకునే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఆగస్టు-సెప్టెంబర్లో డిమాండ్లో రికవరీ ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ప్రారంభ దశలో పెట్టుబడిలో మెరుగుదల ఉంది.
జూలై-ఆగస్టులో ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే తక్కువగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బిఐ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 7.9 శాతం, మూడవ త్రైమాసికంలో 6.8 శాతం, నాల్గవ త్రైమాసికంలో 6.1 శాతంగా అంచనా వేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ రియల్ జిడిపి 17.1 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు.
ద్రవ్యోల్బణంపై 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చని దాస్ చెప్పారు. గత సమావేశంలో 5.7 శాతంగా అంచనా వేయబడింది.
రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.1 శాతం, మూడవ త్రైమాసికంలో 4.5, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం ఉండవచ్చు.
2022-2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిపిఐ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండే అవకాశం ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ డిమాండ్ను పెంచుతుంది. ఇంకా శక్తికాంత దాస్ పండుగలలో పట్టణ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఐఎంపిఎస్ లావాదేవీల పరిమితి పెరిగింది- ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ తక్షణ చెల్లింపు సేవ (IMPS) ద్వారా లావాదేవీ పరిమితిని రూ .2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచింది.