వాహనదారులకు షాకిస్తూన్న ఇంధన ధరలు.. సెంచరీకి చేరువలో డీజిల్..
దేశీయ ఇంధన ధరలు పరుగు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు వరుస 4వ రోజు శనివారం పెట్రోల్ ధరను లీటర్కు 26 నుండి 30 పైసలు, డీజిల్ లీటరుకు 33 నుండి 37 పైసలు పెంచింది. పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యుడికి పెను భాగంగా మారాయి.
తాజాగా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర అత్యధిక స్థాయికి పెరిగింది. ఐఓసిఎల్ వెబ్సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 103.84, డీజిల్ ధర రూ .92.47 కి చేరుకుంది. ముంబైలో నేడు డీజిల్ ధర రూ .100 దాటింది. 4 అక్టోబర్ 2021న పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నప్పటికి ఆ తర్వాత పెరుగుతూ వస్తున్నాయి.
నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధర (09 అక్టోబర్ 2021)
ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర రూ. 103.84, డీజిల్ ధర రూ. 92.47
ముంబై పెట్రోల్ ధర రూ. 109.83, డీజిల్ ధర రూ. 100.29
చెన్నై పెట్రోల్ ధర రూ. 101.27, డీజిల్ రూ .96.93.
కోల్కతా పెట్రోల్ ధర రూ. 104.52, డీజిల్ ధర రూ. 95.58
ఇక శనివారం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై రూ. 30 పైసల వరకు పెరిగి రూ. 107.71కి చేరింది. డీజిల్ (diesel) ధర రూ.0.22 పైసలు పెరిగి రూ.101.33 గా ఉంది.
దేశంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలు హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసి ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను జారీ చేస్తాయి. కొత్త ధరలు మీరు కంపెనీ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. మీరు మొబైల్ ఫోన్లలో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఇంధన ధరలను తనిఖీ చేయవచ్చు. 92249 92249 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీరు పెట్రోల్, డీజిల్ ధర గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు మీరు ఆర్ఎస్పి <space> పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ను 92249 92249 కి పంపాలి.
వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల ఆధారంగా ఇంధన ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు, నగరాల్లో కూడా మారుతూ ఉంటాయి. నివేదికల ప్రకారం రాజస్థాన్ దేశంలో అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది, తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి.
గత సంవత్సర కాలంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై తీవ్రంగా పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా దేశంలో మాత్రం ఇంధన ధరలు తగ్గలేదు.