మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైసలే, పైసలను సంపాదిస్తాయి
Money Tips: చేతిలో రూ.30 లక్షలు ఉంటే చాలా మంది ముందుగా వ్యాపారం చేయాలని లేదా ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందో అని ఆలోచిస్తారు. అయితే వ్యాపారం అంటే లాభాలతో పాటు నష్టాల ప్రమాదం కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా భయాలుంటాయి.

ఇలా ప్లాన్ చేసుకుంటే జీరో రిస్క్
మార్కెట్ భయాలకు తావులేకుండా మీ డబ్బులే డబ్బులను సంపాదిస్తే భలే ఉంటుంది కదూ! అలాంటి పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ దగ్గర ఉన్న రూ. 30 లక్షల్లో మొదట రూ.15 లక్షలను పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఒక వ్యక్తి పేరుతో సింగిల్ అకౌంట్లో గరిష్టంగా రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ప్రస్తుతం దీనిపై వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.9,250 వడ్డీ మీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది. ఐదేళ్లలో మొత్తం రూ.5,55,000 వరకు వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెలా ఖర్చులకు ఒక స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
మరో రూ. 15 లక్షలతో ఇలా చేయండి..
మీ ఇంట్లో 60 సంవత్సరాలు పూర్తి చేసిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఉంటే, వారి పేరుతో పోస్టాఫీస్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో మరో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై వార్షికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1,23,000 వడ్డీ వస్తుంది. ఈ పథకంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. అంటే ప్రతి త్రైమాసికానికి రూ.30,750 మీ ఖాతాలో జమ అవుతుంది. దీన్ని నెలవారీగా లెక్కిస్తే సగటున రూ.10,250 ఆదాయం లభిస్తుంది. ఐదేళ్లలో మొత్తం రూ.6,15,000 వరకు వడ్డీ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
నెలకు రూ. 20 వేల ఆదాయం
రూ.30 లక్షలను సమానంగా ఈ రెండు పథకాలలో విభజిస్తే వచ్చే ఆదాయం ఇలా ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ద్వారా నెలకు సుమారు రూ.9,250కాగా.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా నెలవారీ సగటున రూ.10,250 వస్తుంది. అంటే మొత్తం కలిపి ప్రతి నెలా సుమారు రూ.19,500 నుంచి రూ.20,000 వరకు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రెండు పథకాలూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. అందువల్ల మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా వడ్డీ ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అసలు పెట్టుబడిని కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
రిస్క్ తీసుకోవాలనుకోని వారికి ఇది మంచి ఎంపిక
చాలామందికి వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నా నష్టపోతామేమో అనే భయం ఉంటుంది. మరికొందరు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో వచ్చే హెచ్చుతగ్గులను ఎదుర్కోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈ విధమైన ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చేసిన వారు, నెలనెలా ఖర్చులకు స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు, కుటుంబ ఆర్థిక భద్రతను కోరుకునే వారు ఈ విధమైన పెట్టుబడులను పరిశీలించవచ్చు. అయితే SCSSలో పెట్టుబడి పెట్టాలంటే ఖాతాదారుడు అర్హత నిబంధనలను తప్పనిసరిగా పూర్తి చేయాలి.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి
కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తుంది. అయితే సాధారణంగా ఖాతా ప్రారంభించిన సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఆ డిపాజిట్కు మెచ్యూరిటీ వరకు వర్తిస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు పోస్టాఫీస్ లేదా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో తాజా నిబంధనలు, వడ్డీ రేట్లను ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.

