గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు షాకు.. భారీగా పెరిగిన ఎల్పీజీ ధర.. ఆగష్టు 1 నుంచి అమలు..
గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను సిలిండర్ పై రూ. 73.5 పెంచింది. ఈ కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి. అలాగే 14.2 కిలోల దేశీయ ఎల్పిజి సిలిండర్ ధరలలో మాత్రం ఎటువంటి మార్పులేదు.
ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ .1500 నుండి రూ .1623కి పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు పెరిగింది. కోల్ కతాలో రూ.1629.00 చేరగా, చెన్నైలో రూ.1761.00గా ఉంది. చమురు & గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి.
జులైలో దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు
14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను ఆగస్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. జూలై నెలలో చమురు కంపెనీలు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్పై రూ.25.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్పిజి సిలిండర్ ధర రూ. 834.50, ముంబైలో రూ .834.50, కోల్కతాలో రూ.861 , చెన్నైలో సిలిండర్కు రూ. 850.50గా ఉంది. హైదరాబాద్లో రూ.887లుగా ఉంది.
ఈ ఏడాది 2021లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. 1 జనవరి 2021న 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రెట్టింపు అయింది.