Money: ఎగ్గొట్టిన డబ్బులను ఈజీగా వసూలు చేసుకోండి.. ఈ ట్రిక్ మీరూ తెలుసుకోండి
Money: అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి ఉన్న చట్టపరమైన మార్గాలను న్యాయ నిపుణులు సూచించారు. నగదు లావాదేవీల కంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ మేలని, ప్రామిసరీ నోట్లు, చెక్కుల ప్రాధాన్యాన్ని వివరించారు.

నగదు రూపంలో అప్పు ఇవ్వకండి
సమాజంలో నమ్మకంతో అప్పు ఇచ్చి, తిరిగి రాక ఇబ్బంది పడేవారు ఎందరో ఉన్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి కావాలనే ఎగ్గొట్టాలని చూస్తే, భౌతిక దాడులకు దిగకుండా చట్టపరంగా ఆ డబ్బును ఎలా రాబట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా.. సాధారణంగా స్నేహితులు లేదా బంధువులకు నగదు రూపంలో అప్పు ఇస్తుంటాం. దీనికి సరైన ఆధారాలు ఉండవు. కాబట్టి ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అప్పు ఇవ్వడం మంచిది. ఇది కోర్టులో బలమైన సాక్ష్యంగా మారుతుంది.
ప్రామిసరీ నోటు, చెక్
అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు రాయించుకోవడం, దానితో పాటు భద్రత కోసం సంతకం చేసిన చెక్కులను తీసుకోవడం చాలా ముఖ్యం. చెక్కులు ఉంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్(NI) యాక్ట్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది.
లీగల్ నోటీసు పంపడం
డబ్బులు అడిగినా ఇవ్వని పక్షంలో, ముందుగా ఒక న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపాలి. అందులో అప్పు తీసుకున్న తేదీ, కారణం, గడువు వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. నోటీసు అందిన తర్వాత కూడా స్పందించకపోతే సివిల్ సూట్ ఫైల్ చేయవచ్చు.
ఆస్తుల జప్తు (Attachment of Property)
కోర్టులో కేసు వేసిన తర్వాత, అప్పు తీసుకున్న వ్యక్తికి ఉన్న ఆస్తులను (ఇల్లు, పొలం మొదలైనవి) గుర్తించి, వాటిని జప్తు చేయాలని కోర్టును కోరవచ్చు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులను వేలం వేసి బాకీని వసూలు చేస్తారు.
దివాలా (Insolvency) పిటిషన్
అప్పు తీసుకున్న వ్యక్తి తన వద్ద ఏమీ లేదని 'దివాలా' తీసినట్లు కోర్టులో పిటిషన్ వేస్తే, దానిని న్యాయవాది ద్వారా కంటెస్ట్ చేయాలి. అతను కావాలనే ఆస్తులను దాచిపెట్టినట్లు నిరూపిస్తే, అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

