కాంబో ప్లాన్ లేదంటే వేర్వేరు ప్రణాళికలు:12న జియో గిగా ఫైబర్ లాంచనమే?
టెలికం సంచలనం రిలయన్స్ జియో.. గిగా ఫైబర్ రూపంలో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం 1100 నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సేవలపై ఈ నెల 12న రిలయన్స్ వార్షిక సమావేశంలో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బ్రాడ్ బాండ్ సేవల్లో ఇంటర్నెట్, జియో హోం టీవీ, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటిపై విడివిడిగా గానీ, కాంబో ప్లాన్ గానీ అమలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
టెలికం రంగంలో అడుగుపెట్టి ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో ఈ నెల 12వ తేదీన మరో సంచలనం ప్రకటించనుంది. జియో గిగాఫైబర్ పేరుతో ఒకేసారి ఒకే కనెక్షన్పై మూడు సేవలు అందించేందుకు సిద్ధం అవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో యాజమాన్యం బ్రాడ్ బాండ్ సేవలు, వాటి చార్జీలను ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇప్పటికే జియో గిగా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, టీవీ సేవలు దేశ వ్యాప్తంగా కేవలం 1,100 నగరాల్లో అందుబాటులోకి వచ్చినా ఇవి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. తుది దశలో ఉన్న ఈ పరీక్షలు విజయవంతమైతే పూర్తి స్థాయిలో వాణిజ్యపరంగా గిగా ఫైబర్ సేవలు ప్రారంభం అవుతాయి.
ట్రయల్ పద్ధతిలో ప్రస్తుతం వినియోగదారులు రిలయన్స్ జియో గిగా ఫైబర్ నుంచి ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందుతున్నారు. బ్రాడ్ బాండ్ సేవలు ప్రారంభమైన తర్వాత నెలవారీ ఛార్జీలు ఎంత ఉంటాయనే దానిపై వినియోగదారుల్లో స్పష్టత లేదు. దీని ప్రకారం.. జియో ఫైబర్ నుంచి మూడు వేర్వేరు ప్లాన్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇంటర్నెట్, టీవీ, ఐఓటీ సేవల్లో ఏదో ఒకటి ఎంచుకొనే సదుపాయంగానీ, మూడూ ఎంపిక చేసుకొనే వెసులుబాటు గానీ ఉండనుంది.
జియో గిగా ఫైబర్ ద్వారా పరిమితి లేని వాయిస్ కాల్స్తోపాటు, 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్, జియో హోం టీవీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), కొన్ని జియో యాప్స్కు ఉచిత చందా వంటి సౌకర్యాలు ఉన్నాయని ఒక జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇంటర్నెట్, జియో హోం టీవీలతోపాటు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కింద ఉచితంగా జియో యాప్స్ పొందొచ్చు.
28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ను ప్రవేశపెట్టనుండగా.. నెలవారీ ఛార్జీ రూ.500 నుంచి రూ.వెయ్యి మధ్య ఉండే అవకాశం ఉంది. అధికారికంగా టారీఫ్ ఛార్జీలు సంస్థ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ట్రయల్ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో సెక్యురిటీ డిపాజిట్ రూ.2,500 నుంచి రూ.4,500 వసూలు చేసి గిగా ఫైబర్ కనెక్షన్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా రూటర్ తదితరాలు అమర్చుతారు. కనెక్షన్ వద్దనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తామని రిలయన్స్ జియో గిగా ఫైబర్ వర్గాలు చెబుతున్నాయి.
కాంబోప్లాన్లో బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, టీవీ సేవలను ఒకే ఒక్క కనెక్షన్తో పొందవచ్చు. ఈ ప్లాన్ ధర నెలకు రూ.600గా ఉండే అవకాశం ఉంది. రూ.1000 ప్లాన్లో ఇంట్లోని 40 డివైజ్లకు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా మూడు వేర్వేరు ప్లాన్లను తేనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇంటర్నెట్, టీవీ, ఐఓటీ సేవల్లో ఏదో ఒకదానిని కూడా ఎంచుకునే వెసులుబాటు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.