Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?
Gold Hike: గత మూడు రోజులుగా వరుస పతనంతో ఊరటనిచ్చిన పసిడి ధరలు.. శుక్రవారం మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. తగ్గిన ధరలు చూసి సంతోషించేలోపే స్వల్పంగా రేట్లు పెరిగాయి. ఇంతకీ ఎంత పెరిగిందో తెలుసా?

స్వల్పంగా పెరిగిన బంగారం
అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 700 మేర తగ్గగా, నేడు ఆ నష్టాల నుంచి మార్కెట్ కోలుకుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
కాస్త శాంతించిన వెండి
ముందుగా.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే... హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ. 1,41,600 వద్ద నమోదైంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే.. ఒకే రోజులో దీనిపై రూ. 270 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా ఈరోజు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,29,800 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే దీనిపై రూ. 250 పెరిగింది. వెండి మాత్రం కాస్త శాంతించింది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.2,29,900కు చేరుకుంది.
మార్కెట్లు గమనించాలి
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే.. దేశీయంగా ధరలు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా గమనించే దుబాయ్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. కాబట్టి ధరలు ఎప్పటికప్పుడు గమనిస్తూ కొనుగోలుచేయడం ఉత్తమం.
