ఫలితాలు సూపర్బ్.. ప్రగతికి ఊతం.. మోదీపై కార్పొరేట్ల ప్రశంసల హోరు
కేంద్రంలో సుస్థిరమైన పాలన అందించగలిగిన సమర్థత గల నేత ప్రధాని నరేంద్రమోదీ అని కార్పొరేట్ ప్రపంచం కొనియాడుతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని, ఇవి ప్రగతికి ఊతంగా పని చేస్తాయని పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశాభివృద్ధికి ఊతం లభిస్తుందని, విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తాయని కార్పొరేట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు ఆ దిశగానే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి సంపూర్ణ మెజార్టీతో పాలన పగ్గాలు చేపడుతుండటంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు.
బయోకాన్ చైర్ పర్సన్ కం ఎండీ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ.. ఎన్డీఏ 1.0 ప్రజలను మెప్పించిందని కొనియాడారు. గత అయిదేళ్లుగా వ్యూహాత్మకంగా పాలన సాగించిన ప్రధాని మోదీ హయాంలో ఎన్డీఏ 2.0కు ప్రజలు ఆమోదం తెలిపారన్నారు. వచ్చే అయిదేళ్లలో ఆర్థిక వృద్ధిపై దృష్టి నిలిపి ప్రతి ఒక్కరికీ సంపద పెరిగేలా చూడాలని కిరణ్ మజుందార్ షా ఆకాంక్షించారు.
కోటక్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ మాట్లాడేతూ.. భారత్ గొప్ప శక్తిగా మారేందుకు అనువైన సమయమిదని అన్నారు. కొత్త ప్రభుత్వం లోతైన సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తన జీవితకాలంలో భారత్ను సూపర్పవర్గా చూడాలని కల కంటున్నానన్నారు. సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ, ఎన్డీఏకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు.
భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ స్పందిస్తూ.. సార్వత్రిక ఎన్నికల్లో మోదీపై దేశ ప్రజలకు ఉన్న విశ్వాసం ఫలితాల్లో కనిపించిందని కొనియాడారు. ఆయన నిర్ణయాత్మక, అద్భుతమైన నాయకత్వంతో ఫలితాలు అనూహ్యంగా వచ్చాయని, ఆయన ఆర్థిక అజెండాను సమర్థంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇవి దోహదం చేయనున్నాయన్నారు.
వేదాంతా రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ స్పందిస్తూ.. ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు అని తెలిపారు. రెండో దఫా కూడా ప్రగతి వైపు మోదీ సర్కారు అడుగులు వేసి, దేశాన్ని వృద్ధి వైపు నడిపించాలని ఆకాంక్షించారు.
ప్రముఖ కార్పిరేట్ సంస్థ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతర్జాతీయంగా సూపర్ పవర్గా అవతరిస్తుందని తెలిపారు. మహిళలు, యువత, కొత్త ఓటర్లు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేశారని ఆనంద్ మహీంద్రా చెప్పారు.
నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా స్పందిస్తూ.. దేశం పూర్తిగా రూపాంతరం చెందడానికి గొప్ప సంస్కరణలు తేవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అధిక ఉత్పాదకత గల ఉద్యోగాలను సృష్టించి వ్యాపారాలకు, వ్యాపారవేత్తలకు ఒక మంచి వ్యవస్థను కొత్త ప్రభుత్వం అందించాలని సూచించారు.
గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్ స్పందిస్తూ.. దేశ జీడీపీ వృద్ధిని మెరుగుపరిచేందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం కార్పొరేట్ పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎక్కువగా మన దేశంలో కార్పొరేట్ పన్ను ఉందని, దీన్ని 25 శాతానికి తగ్గించాలని సూచించారు.
ఆదానీ గ్రూప్ సంస్థ చైర్మన్ గౌతం ఆదానీ మాట్లాడుతూ మన దేశానికి ప్రజాస్వామ్య విలువలే బలమని, దేశ భవిష్యత్ కోసం ఓటర్లు వివేకంతో ఓటేశారని పేర్కొన్నారు. అభివృద్ధి తర్వాత మౌలిక వృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి, సాంకేతికతను వినియోగించడంలో కొత్త పుంతలు తొక్కించాలని పిలుపునిచ్చారు.
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పందిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడం అభినందనీయం అని అన్నారు. మోదీ నాయకత్వం, ఆయన చేపట్టిన సంస్కరణలు వృద్ధిని పెంచేవే. సగటు భారతీయులు నాణ్యమైన జీవితం గడిపేందుకు దోహదం చేసేవేన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంస్కరణలు అమలు చేశారు. అయితే అవి మధ్యలోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంతో వాటిని కొనసాగిస్తారు. ఓటర్లు మోదీపై పూర్తి విశ్వాసం ఉంచారు. అందుకే ఆయనకు మళ్లీ పట్టం కట్టారని చెప్పారు.
కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ స్పందిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో విధాన నిర్ణాయక తీర్పు వెలువడటంతో భారత్ అభివ్రుద్ధి మరో దశకు వెళ్లడంతోపాటు పరివర్తన దిశగా దేశం సాగుతుందన్నారు. గత ఐదేళ్లలో సమగ్ర ఎజెండాతో పని చేసిన ప్రభుత్వం పరిశ్రమల పురోభివ్రుద్ధి సరైన వాతావరణం కల్పించిందని పేర్కొన్నారు.