జాగ్రత్త: జూన్ 1 నుండి చెక్ పేమెంట్ నియమాలలో మార్పు.. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) కఠినమైన నియమాలు ఉన్నప్పటికీ చెక్ పేమెంట్ లో మోసాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారు సామాన్య ప్రజలను దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.
పెరుగుతున్న మోసాలని దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు చెక్ పేమెంట్ సంబంధించిన నిబంధనలో పెద్ద మార్పు చేసింది. తాజాగా దీనికి సంబంధించి పాజిటివ్ పే సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది. ఈ నియమం 1 జూన్ 2021 నుండి అమలులోకి వస్తుంది.
పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి ?
పాజిటివ్ పే సిస్టమ్ కింద చెక్ జారీ చేసే వ్యక్తి తన చెక్కుకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకుకు పంపాల్సి ఉంటుంది. చెక్కును జారీ చేసిన వ్యక్తి చెక్ తేదీని, లబ్ధిదారుడి పేరు, గ్రహీత పేరు, చెల్లింపు మొత్తాన్ని తిరిగి బ్యాంకుకు తెలియజేయాలి.
పాజిటివ్ పే సిస్టమ్ ఎంత మొత్తానికి వర్తింపజేస్తారు ?
50వేలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ చెక్ ద్వారా చేసే చెల్లింపుకు పాజిటివ్ పే సిస్టమ్ వర్తిస్తుంది. పాజిటివ్ పే సిస్టమ్ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ చెక్కును జారీ చేసినప్పుడు మాత్రమే చెక్ సమాచారాన్ని తిరిగి ధృవీకరించాలి.
పాజిటివ్ పే సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
ఈ సిస్టం ద్వారా చెక్ సమాచారాన్ని ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం ద్వారా ఇవ్వవచ్చు. చెక్ పేమెంట్ చేసే ముందు ఈ వివరాలు రెండుసార్లు తనిఖీ చేయబడతాయి. చెక్ ట్రంక్షన్ వ్యవస్థ కింద చెక్కుల క్లియరింగ్లో మోసాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడమే పాజిటివ్ పే సిస్టమ్. చెక్ ట్రంక్షన్ వ్యవస్థ చెక్కులను క్లియర్ చేసే ప్రక్రియ. ఇది చెక్కుల సేకరణ ప్రక్రియను వేగంగా చేస్తుంది.
ఆర్బిఐ నిర్ణయం
సురక్షితమైన చెక్ ఆధారిత లావాదేవీల కోసం 2021 జనవరి 1 నుంచి పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అలాగే ప్రైవేట్ రంగ ఐసిఐసిఐ బ్యాంక్ 2016 నుండి వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఆర్బిఐ మార్గదర్శకాల ఆధారంగా 2021 జనవరి 1 న కొత్త పాజిటివ్ పే సిస్టమ్ ను ప్రారంభించింది.