Saving scheme: రూ. 36 పొదుపు చేస్తే రూ. 6 లక్షలు పొందొచ్చు.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ సంస్థలు మంచి పథకాలను అందిస్తున్నాయి. అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల భవిష్యత్తు కోసం
ఈ రోజుల్లో ఎంత సంపాదిస్తున్నామన్నది కాకుండా, ఎంత ఖర్చును సమర్థవంతంగా నియంత్రిస్తున్నామన్నదే కీలకమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు చిన్న వయసులోనే వారి భవిష్యత్తు కోసం పొదుపు ప్రారంభించాలన్నదే నిపుణుల సలహా. ఎందుకంటే పిల్లలు ఎదుగుతుండగా వారి విద్య, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసం ఖర్చులు భారీగా పెరుగుతాయి. అందుకే పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే పొదుపు చేయడం మొదలు పెడితే మంచి ఆదాయం పొందొచ్చు.
పోస్టాఫీస్ పథకం
ఇలాంటి వారి కోసమే పోస్టాఫీస్ బాల జీవన్ బీమా పథకం (Bal Jeevan Bima Yojana) పేరుతో ఓ పథకం అందిస్తోంది. చాలా తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ పథకంలో రోజుకు కనీసం రూ.6 నుంచి గరిష్ఠంగా రూ.18 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్కి అర్హత ఉన్న పిల్లల వయసు 5 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఈ పొదుపు తల్లిదండ్రులు వారి పిల్లల పేరిట ప్రారంభించాలి. పొదుపు చేసే తల్లిదండ్రుల వయసు 45 సంవత్సరాలు మించరాదు.
రూ.18తో మూడు లక్షలు
ఈ స్కీమ్ ప్రకారం ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు మాత్రమే లబ్ధిదారులుగా ఉండొచ్చు. ఒక్కొక్కరికి రోజుకు రూ.6 పొదుపుతో మెచ్యూరిటీ సమయానికి కనీసంగా రూ.1 లక్ష రాబడి వస్తుంది. అదే రూ.18 వరకు పెట్టుబడి పెడితే ముగింపు నాటికి రూ.3 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇద్దరు పిల్లల పేర్లపై రోజుకు రూ.36 (అంటే ఒక్కొక్కరికి రూ.18) పొదుపు చేస్తే, చివరికి మొత్తం రూ.6 లక్షల వరకు లాభం పొందవచ్చు.
పాలసీ నిబంధనలు, బోనస్ వివరాలు:
పాలసీ తీసుకునే సమయంలో తల్లిదండ్రుల వయసు 45 ఏళ్లు మించరాదు. పాలసీ కాలపరిమితి ముగిసేలోపు తల్లిదండ్రుల్లో ఎవరు ఒకరు మరణించినా మిగతా ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. పాలసీ గడువు పూర్తయిన తరువాత పిల్లలకి మొత్తం చెల్లిస్తారు.
ఈ పాలసీపై రుణ సౌలభ్యం లేదు. పాలసీని మధ్యలో ఆపాలనుకుంటే, కనీసం 5 ఏళ్ల తర్వాతే సరెండర్ చేయొచ్చు. ప్రతి రూ.1,000 హామీ మొత్తంపై సంవత్సరానికి రూ.48 బోనస్ చెల్లిస్తారు.
ఎలా ఓపెన్ చేయాలి.?
ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీప పోస్టాఫీస్ను సందర్శించాలి. అధికారులను సంప్రదించి పూర్తి సమాచారం తీసుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫామ్ను నింపాలి. అందులో పిల్లల వివరాలు, తల్లిదండ్రుల వివరాలు, గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించి ఖాతా ఓపెన్ చేయొచ్చు.