రూ.350, రూ.5 కరెన్సీ నోట్లు రానున్నాయా? RBI ఏమంటోంది
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్తగా రూ.350, రూ.5 కరెన్సీ నోట్లు ను విడుదల చేస్తుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. వార్తే కాకుండా ఆ ఫోటోలు కూడా షేర్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలో నిజమెంత? RBI ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నల్ల ధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దే మార్గమని RBI భావించింది. అందుకే 2016 పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆర్బీఐ కొత్త రూ.500, రూ.2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల వల్ల నల్ల ధనం పెరుగుతుందని భావించిన ఆర్బీఐ రూ.1000 కరెన్సీ నోటు కంటే పెద్దదైన రూ.2000 నోటును తీసుకు రావడం వెనుక ఆంతర్యం జనానికి అర్థం కాలేదు.
అయితే ఆ తర్వాత కూడా కొత్త రూ.200 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఇలా నోట్లు మార్పు వల్ల నల్లధనం అరికట్టడం సంగతి ఎలా ఉన్నా దొంగ నోట్ల ముద్రణ, చలామణి తగ్గుతాయని ఆర్బీఐ చెబుతోంది.
2023లో మరోసారి RBI నోట్ల రద్దు దిశగా అడుగులు వేసింది. చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు అయిన రూ. 2,000 నోటును వెనక్కు తీసుకోవడం ప్రారంభించింది. 2016లో చేసినట్లుగా ఒక్కసారిగా రద్దు చేయకుండా రూ.2000 నోటును వెనక్కు తీసుకోవడం ప్రారంభించింది. చలామణిలో ఉంచుతూనే బ్యాంకులకు వచ్చిన వాటిని అక్కడే ఆపేసేలా ఆదేశాల్చింది. ఇలా 2024 చివరికి దాదాపుగా 2000 నోట్లు ఆర్బీఐ దగ్గరకు వచ్చేశాయి.
రూ.2000 నోటు ఉపసంహరణతో ప్రస్తుతం రూ. 500 నోటు దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ కరెన్సీ నోటుగా మారింది. అయితే టీవీలు, న్యూస్ పేపర్ల కంటే విస్తృతంగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఆ విషయాలు నిమిషాల్లో దేశ వ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి. అలా ఇటీవల రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్ల ఫోటోలని చెబుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్లను ఆర్బీఐ జారీ చేసినట్లు వార్త ప్రచారం అవుతోంది.
అయితే ఇవి కొత్త చిత్రాలు కావని, మూడేళ్ల క్రితం ఇలాగే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఇప్పుడు కూడా కొందరు కావాలని ఈ ఫోటోలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఇవన్నీ నకిలీ ఫోటోలు. దేశంలో కొత్త డినామినేషన్ నోట్లను విడుదల చేయలేదని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న డినామినేషన్లు రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500. ఇవి కాకుండా రూ.2, రూ.5 నోట్లు కూడా ఉన్నాయి. అయితే వాటి ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. అయినప్పటికీ మార్కెట్లో ఉన్నవి చట్టబద్ధంగా ఉపయోగించాలని ఆర్బీఐ తెలిపింది.
RBI ఏం చెబుతోంది...
"ఏదైనా కొత్త కరెన్సీ లేదా కాయిన్ ను విడుదల చేసే హక్కు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. ఇలాంటివి ఏవైనా విడుదల చేసినప్పుడు కచ్చితంగా ప్రకటిస్తాం. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకటన కాకుండా ఎవరు ఇలాంటివి చెప్పినా నమ్మవద్దు. ప్రస్తుతం రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 మరియు నోట్లు, నాణేలు మాత్రమే చలామణిలో ఉన్నాయి."