యాపిల్ మాస్టర్ ప్లాన్.. అమెరికాలో అమ్మే ఫోన్లు కూడా భారత్లోనే. ఐఫోన్ 17 సిరీస్తోనే..
ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో భయపెడుతోన్నా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ మాత్రం తగ్గడం లేదు. ఐఫోన్ 17 సిరీస్ తయారీ విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

గేమ్ ప్లాన్ మార్చిన యాపిల్
యాపిల్ మరోసారి తన గేమ్ ప్లాన్ను మార్చింది. తొలిసారిగా రాబోయే "ఐఫోన్ 17 సిరీస్"లోని అన్ని మోడళ్లు, ప్రో వెర్షన్లు సహా, నేరుగా భారతదేశంలోనే తయారుకానున్నాయి. అమెరికా మార్కెట్లో అమ్మే ఐఫోన్లను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయాలని యాపిల్ ప్రణాళికలు వేస్తోంది. చైనాపై ఆధారపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
KNOW
అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ సుంకాలు విధించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యాపిల్ కంపెనీ చైనాకు బదులు ఇతర దేశాలకు మకాం మార్చాలని ఒత్తిడి తెచ్చారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి యాపిల్ భారత్ను ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎంచుకుంది.
భారత్లో పెరుగుతున్న ఉత్పత్తి కేంద్రాలు
ఇప్పటికే యాపిల్ భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించింది. ప్రస్తుతం ఐదు ప్లాంట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, వీటిలో తాజాగా ప్రారంభించిన రెండు ప్లాంట్లు కూడా ఉన్నాయి. తమిళనాడులోని హోసూరు టాటా ఫెసిలిటీ, బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరలోని ఫాక్స్కాన్ యూనిట్ ప్రధాన కేంద్రాలుగా మారాయి. టాటా గ్రూప్ కీలక భాగస్వామిగా మారి, మరో రెండు సంవత్సరాల్లో భారత్లో ఉత్పత్తి అయ్యే ఐఫోన్లలో దాదాపు సగం వాటాను హ్యాండిల్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఐఫోన్ 17e, 18పై కూడా దృష్టి
"ఐఫోన్ 17" సిరీస్తో పాటు, భారత్లోనే ప్రత్యేకంగా "ఐఫోన్ 17e" తయారు చేయాలన్న ప్రణాళికలు యాపిల్ వేసుకుంటోందని సమాచారం. ఇది "ఐఫోన్ 16eషకి కొనసాగింపుగా వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అంతేకాకుండా, "ఐఫోన్ 18" ఉత్పత్తి ప్రణాళికలపై చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లలోనూ..
యాపిల్ మొదటిసారి భారత్లో ఐఫోన్లను అసెంబుల్ చేయడం 2017లో ప్రారంభించింది. అప్పటి నుంచి క్రమంగా ఇక్కడ ఉత్పత్తి పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ట్రంప్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు “భారత్లో ఉత్పత్తి అవసరం లేదని, ఇక్కడ అధిక సుంకాలు ఉంటాయని” వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, భారత్లో పెట్టుబడులు కొనసాగిస్తామని యాపిల్ స్పష్టం చేసింది. ఇది భారత్ను ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ తయారీకి కీలక కేంద్రంగా మార్చబోతుందనే సంకేతాలను ఇస్తోంది.