అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు పోటీగా మరో కొత్త ఈ-కామర్స్ కంపెనీ...
ఇప్పటివరకు దేశీయ ఈ-కామర్స్ వ్యాపారాన్నేలిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు 2020లో సరికొత్త సవాల్ ఎదురు కానున్నది. ఇప్పటికే జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంలో సెన్సేషనల్ మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ వచ్చే దీపావళి నాటికి ఈ-కామర్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆన్లైన్ మార్కెట్లో భారీ ప్రకంపనలే రానున్నాయి. ఈ-కామర్స్ రంగంలోకి రిలయన్స్ అడుగుపెడుతుండటమే దీనికి కారణం. దీంతో ప్రస్తుతం ఈ రంగాన్ని ఏలుతున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలకు సవాళ్లు తప్పవన్న అంచనాలు ఈ-కామర్స్ పరిశ్రమ నుంచి వ్యక్తం అవుతున్నాయి.
దేశీయ టెలికం రంగ ముఖచిత్రాన్ని రిలయన్స్ జియో ఏ స్థాయిలో మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఆన్లైన్ షాపింగ్ తీరు తెన్నులూ రిలయన్స్ రాకతో మారిపోగలవన్న అభిప్రాయాలు సర్వత్రా నిపుణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు సంప్రదాయ మార్కెట్ను కలిగి ఉన్న భారత్ను.. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ శాసిస్తున్నది. స్మార్ట్ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతోపాటు ఇంటర్నెట్ చౌకగా లభించడంతో వినియోగదారులంతా అన్నీ ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్కు యువత అమితాసక్తి ప్రదర్శిస్తున్నది.
ఫలితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు భారీ డిమాండ్ కనిపిస్తున్నది. ఈ రంగంపై రిలయన్స్ కన్ను పడింది. ఈ ఏడాది పండుగ సీజన్లో ఆన్లైన్ సేల్స్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్లు రికార్డు స్థాయిలో నమోదు చేసిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 మధ్య ఏకంగా రూ.19 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు బెంగళూరుకు చెందిన రెడ్సీర్ కన్సల్టింగ్ తెలిపింది. ఇందులో అమెజాన్, ఫ్లిప్కార్ట్ల వాటానే 90 శాతమని పేర్కొన్నది.
వచ్చే ఏడాది దీపావళికల్లా దేశీయ ఈ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్ రంగ ప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కస్టమర్లకు ఆఫర్లే.. ఆఫర్లు అన్న అంచనాలు మిన్నంటుతున్నాయి. జియో ప్రారంభ సమయంలో ఇంటర్నెట్ను ఉచితంగా ఇచ్చిన ముకేశ్.. ఆన్లైన్ షాపర్స్ను ఇంకెలా ఆకట్టుకుంటారో చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
రిలయన్స్ ఈ-కామర్స్ బిజినెస్లోకి దిగడం అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు దెబ్బేనని వారు విశ్లేషిస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈ-కామర్స్ పాలసీతోనే ఆన్లైన్ షాపింగ్ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ సమయంలో రిలయన్స్ రాక మరింత ప్రతికూలమేనని స్పష్టంగా చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా 6,600లకుపైగా నగరాలు, పట్టణాల్లో విస్తరించిన 10,145 రిలయన్స్ రిటైల్ స్టోర్లు.. రిలయన్స్ ఈ-కామర్స్ వ్యాపారానికి దన్నుగా నిలువనున్నాయి. జియో 4జీ సేవలూ కలిసిరానున్నాయి. 2026 నాటికి భారతీయ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 200 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.