చంద్రబాబుకు తలనొప్పి: టీడీపీలో సిట్టింగ్లకు అసమ్మతి సెగ
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి బెడద తీవ్రమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కేటాయించకూడదని వైరి వర్గం అమరావతి వేదికగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్ను పెడచెవిన పెట్టి టిక్కెట్లు కేటాయిస్తే పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని అసమ్మతి నేతలు తేల్చి చెబుతున్నారు.
త్వరలోనే ఏపీ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబునాయుడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు. శుక్రవారం నాడు రాజమండ్రి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిడదవోలు, కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనిసిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి పెద్ద తలనొప్పిగా మారింది.
నిడదవోలు ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. శేషారావుపై వచ్చిన ఆరోపణలు కూడ పార్టీకి తీవ్ర నష్టం తెస్తున్నాయని పార్టీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. దీంతో ఆయనను మార్చాలనే చర్చ కూడ సాగుతోంది.
మరో వైపు కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో జవహర్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. బాబు కేబినెట్లో జవహర్కు స్థానం దక్కింది. అయితే నియోజకవర్గంలో జవహర్ అన్ని వర్గాలను కలుపుకొని పోవడం లేదు. దీంతో జవహర్కు వ్యతిరేకంగా వైరి వర్గం భారీ ర్యాలీలునిర్వహిస్తోంది. జవహర్కు టిక్కెట్టు ఇవ్వకూడదని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొవ్వూరు నుండి తన పేరును పరిశీలించాలని మాజీ ఎమ్మెల్యే రామారావు కూడ ఇటీవలనే బాబును కలిసి కోరారు. జవహర్ కు వ్యతిరేకంగా స్థానికంగా పోటీ టీడీపీ కార్యాలయాన్ని కూడ ఏర్పాటు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా తుడా ఛైర్మెన్ నరసింహాయాదవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇవాళ తిరుపతి అసెంబ్లీ సమీక్ష సమావేశానికి నరసింహా యాదవ్ హాజరుకాకుండానే వెళ్లిపోయారు.
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఈ టిక్కెట్టు తనదేనని ప్రచారాన్ని కూడ ప్రారంభించారు. అయితే హనుమంతరాయచౌదరికి వ్యతిరేకంగా నలుగురు అసమ్మతి నేతలు శుక్రవారం నాడు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఇంకా ఎవరిని కూడ అభ్యర్థిగా ప్రకటించలేదని నలుగురు నేతలు కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించి ప్రకటించారు.
ప్రకాశం జిల్లాలో కనిగిరి సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు మధ్య పోటీ నెలకొంది. ఉగ్ర నరసింహారెడ్డి శనివారం నాడు టీడీపీలో చేరనున్నారు.
ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ కదిరి బాబురావు అనుచరులతో సమావేశమయ్యారు. బాబురావు పార్టీ మారుతారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉగ్ర నరసింహారెడ్డికే పార్టీ టిక్కెట్టు ఇస్తోందనే ప్రచారంతో బాబురావు అనుచరులతో భేటీ అయ్యారు.
గెలుపు గుర్రాలకే చంద్రబాబునాయుడు టిక్కెట్లను కేటాయించనున్నారు. ఈ తరుణంలో కొన్ని స్థానాల్లో సిట్టింగ్లకు మొండిచేయి తప్పకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.