- Home
- Andhra Pradesh
- YSRCP: కంట్రిబ్యూటర్గా మొదలై.. వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఎదిగి. ఎవరీ వెంకట్రామిరెడ్డి.?
YSRCP: కంట్రిబ్యూటర్గా మొదలై.. వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఎదిగి. ఎవరీ వెంకట్రామిరెడ్డి.?
YSRCP: వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి కదిరి నియోజకవర్గానికి చెందిన జి. వెంకటరామి రెడ్డిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఎవరీ వెంకటరామిరెడ్డి.? ఆయన ప్రస్థానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యార్థి దశ నుంచే..
జి. వెంకటరామిరెడ్డికి చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. 1998 నుంచి 2004 వరకు ABVP అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో విద్యార్థి నాయకుడిగా క్రీయాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత తన కెరీర్ 2005లో తనకల్లులో ఈనాడు పత్రికలో కంట్రిబ్యూటర్గా ప్రారంభించారు. స్థానిక సమస్యలపై రిపోర్టులు రాసి, ప్రజా వేదికలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిజంపై ఆసక్తి పెరగడంతో 2008లో ఈనాడు జర్నలిజం స్కూల్లో పీజీ పూర్తి చేశారు. ఇదే ఆయన వృత్తి జీవితంలో కీలక మలుపు అయింది.
ఈటీవీ నుంచి సాక్షి వరకు జర్నలిజం ప్రయాణం
జర్నలిజం కోర్సు పూర్తయ్యాక వెంకట్రామిరెడ్డి ఈటీవీలో స్టాఫ్ రిపోర్టర్గా కడప, ఒంగోలు కేంద్రాల్లో రెండేళ్లు పనిచేశారు. తర్వాత హైదరాబాద్లోని ఎన్టీవీలో డెస్క్ విభాగంలో విధులు నిర్వర్తించారు. అనంతరం సాక్షి ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ డెస్క్లో కీలక బాధ్యతలు చేపట్టారు. వివిధ మీడియా సంస్థల్లో అనుభవం సంపాదించి, సామాజిక అంశాలను లోతుగా అర్థం చేసుకున్న జర్నలిస్టుగా ఎదిగారు.
న్యాయవాదిగా కొత్త ఆరంభం
పత్రికారంగంలో అనుభవం సంపాదించిన తరువాత, వెంకట్రామిరెడ్డి తన వృత్తిని న్యాయరంగంలో కొనసాగించాలని నిర్ణయించారు. అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించి, కదిరి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, న్యాయసేవల ద్వారా కూడా తనదైన పాత్ర పోషించారు.
రాజకీయ రంగంలో అడుగులు
వెంకట్రామిరెడ్డి రాజకీయ ప్రస్థానం భారతీయ జనతా పార్టీతో ప్రారంభమైంది. తొలుత బీజేపీ మండల కన్వీనర్గా, తరువాత సత్యసాయి జిల్లా లీగల్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సేవలో తన కృషి కారణంగా పార్టీ లోకల్ లీడర్షిప్లో విశ్వాసం సంపాదించి, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎదిగారు.
వైసీపీలో కొత్త దశ
తరువాత వెంకట్రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సత్యసాయి జిల్లా కంప్లయింట్ సెల్ డిస్ట్రిక్ట్ కన్వీనర్గా పని చేస్తూ, పార్టీ శ్రేణుల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అక్టోబర్ 8న పార్టీ కేంద్ర కార్యాలయం ఆయనను వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి (స్టేట్ జాయింట్ సెక్రటరీ)గా నియమించింది. చిన్న కంట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి, జర్నలిస్టు, న్యాయవాది, రాజకీయ నాయకుడిగా ఎదిగిన వెంకట్రామిరెడ్డి ప్రయాణం యువతకు ప్రేరణగా నిలుస్తోంది. కృషి, నిబద్ధతతో ఎంత పెద్ద స్థాయికి ఎదగవచ్చో ఆయన ఉదాహరణ చూపిస్తున్నారు.