జగన్ 'ఒక్క ఛాన్సే' మన కొంపముంచింది
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పోస్ట్మార్టం మొదలు పెట్టాడు.పార్టీలో సంస్థాగత లోపాలతో పాటు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ కోరడం కూడ తమ కొంపముంచిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
2019 ఏప్రిల్ 11వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. టీడీపీకి 23 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. బుధవారం నాడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.ఈ సమావేశంలో ఓటమిపై పార్టీ నేతల నుండి చంద్రబాబు ఫీడ్ బ్యాక్ తీసుకొన్నారు.
పార్టీలో చాలా కాలంగా ఉన్న ఇంచార్జీ వ్యవస్థ కూడ టీడీపీ కొంపముంచిందని కొందరు టీడీపీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గాలకు కొంత కాలంగా టీడీపీలో ఇంచార్జీల వ్యవస్థ కొనసాగుతోంది.
అయితే ఈ ఎన్నికలకు ముందే ఇంచార్జీల వ్యవస్థను రద్దు చేస్తున్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత సంస్థాగతంగా టీడీపీలో కొన్ని మార్పులు చోటు చేసుకొన్నాయి.
ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు లేదా పార్టీ నియమించిన వారిని ఇంచార్జీలుగా ఉండేవారు. అయితే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంచార్జీలుగా ఉన్న వారు వరుసగా ఓటమి పాలైనా కూడ వారిని పక్కన పెట్టి కొత్త వారిని అభ్యర్ధులుగా నియమించే విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేవి.
ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంచార్జీలే అభ్యర్థులు అని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.దీంతో పార్టీ ఇంచార్జీ పదవి కోసం నేతల మధ్య పోటీ ఉండేది. ఒకే అసెంబ్లీ, ఎంపీ స్థానాల్లో ఎక్కువ మంది మధ్య పోటీ ఉంటే కొన్ని చోట్ల సమన్వయకమిటీల పేరుతో కమిటీలు కూడ పనిచేసేవి.
2014 ఎన్నికల్లో కూడ ఇంచార్జీల వ్యవస్థ కొనసాగింది. 2019 ఎన్నికలకు ముందు ఇంచార్జీల వ్యవస్థపై చంద్రబాబునాయుడుపై కేంద్రీకరించారు. ఇంచార్జీల వ్యవస్థను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
మరోవైపు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ ప్రజలను కోరడం కూడ వైసీపీకి కలిసొచ్చిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. కాలంతో వేగంగా పరిగెత్తేలా పనులు చేసినా కూడ ప్రజలు మాత్రం వైసీపీ వైపుకు మొగ్గు చూపడంపై టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటమిపై అన్ని కోణాల్లో విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలంతా శక్తి వంచన లేకుండా చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యే వరకు గుంటూరు పార్టీ కార్యాలయాన్ని వాడుకోవాలని కొందరు నేతలు ఈ సమావేశంలో సూచించారు. అయితే గుంటూరు కంటే విజయవాడ అయితే నేతలకు అందుబాటులో ఉంటుందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
అయితే విజయవాడలో పార్టీ కార్యాలయం కోసం స్థలం చూడాలని చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపీ కేశినేని నానికి సూచించారు.వైసీపీ ప్రభుత్వ పని తీరుపై ఇప్పటికిప్పుడే వ్యాఖ్యలు చేయకూడదని కూడ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.