Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Monsoon Alert : మరికొద్దిరోజుల్లో నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే త్వరలోనే వర్షాలు మరింత జోరందుకోనున్నాయన్నమాట.

వర్షాలే వర్షాలు...
Rain Alert : దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 1నే కేరళ తీరాన్ని తాకనున్నాయని అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ (IMD). మే 20 నాటికి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటాయని తెలిపింది.
కొన్ని అంతర్జాతీయ వాతావరణ ఏజెన్సీలు రుతుపవనాలు కాస్త ముందుగానే రావొచ్చని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో కురుస్తున్న వేసవి జల్లులు, ఉరుములు కూడా రుతుపవనాలు సరైన సమయానికే వస్తున్నాయనడానికి సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడులో కురుస్తున్నవి రుతుపవనాలకు ముందు సంభవించే ఉరుములతో కూడిన వర్షాలు (pre-monsoon thunderstorms). మరోవైపు, ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసి, వేసవి మొదలవ్వడం భారత ఉపఖండానికి అనుకూలంగా మారింది. ఆస్ట్రేలియాలో పొడి వాతావరణం ఉండటం వల్ల, అక్కడి నుంచి భారత ఉపఖండం వైపు తేమ గాలులు వీచేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా వాతావరణ కేంద్రం (Bureau of Meteorology) కూడా అక్కడ వర్షాకాలం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో వర్షాలు ఆగిపోవడంతో, 'అదృశ్య మేఘాల వలయం' (Invisible Belt) సముద్రం నుంచి తేమ గాలులను దక్షిణాసియా వైపునకు తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ వలయం భూమధ్యరేఖను దాటి మాల్దీవుల సమీపానికి చేరుకుందని… రాబోయే రోజుల్లో శ్రీలంక, అండమాన్ వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు...
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతూ వేసవికాలం ఫీలింగ్ ఇస్తున్నాయి.. ఇక సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాకాలంలో మాదిరిగా జోరువానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలకు వడగాలులు, ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఈ రెండుమూడు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ (APSDMA) తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టిఆర్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది. ఇక సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో కూడా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో కూడా ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

