విశాఖ దుర్ఘటన: అదమరిచి నిద్రిస్తున్న వేళ కబళించిన విషవాయువు
చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ పిట్టల్లా రాలిపోతున్నారు. తమతో అప్పటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడినవారు ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడి వారిని కలవర పరిచింది.
విశాఖ ప్రజల పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఓ వైపు కరోనా వైరస్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తోంది. విశాఖలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వైరస్ భయంతో కదలకుండా ఇళ్లల్లో కూర్చొన్నారు. ఇంట్లో ఆదమరిచి నిద్రపోతుండగా.. విష వాయువు రూపంలో వారిని మరో భయం కదిలించింది.
ఏం జరుగుతోందో.. ఎలా జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి. కళ్లముందే తమ వాళ్లంతా ఒక్కరొక్కరుగా పడిపోతున్నారు. ఒంటిపై దురదలు వస్తున్నాయి. శ్వాస కూడా తీసుకోలేకపోతున్నారు. కంటి చూపు కూడా మందగించింది.
చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ పిట్టల్లా రాలిపోతున్నారు. తమతో అప్పటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ మాట్లాడినవారు ఒక్కసారిగా కుప్పకూలడం అక్కడి వారిని కలవర పరిచింది.
నగరంలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకవ్వడం వల్లే తమకు అలా జరిగిందన్న విషయం వాళ్లకు తెలిసే సరికే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 20 గ్రామాలకు ఈ విషవాయువు వ్యాపించేంది. 2వేల మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 90మందికి పైగా వెంటిలేటర్ పై చికిత్సలు పొందుతున్నారు.
జనాలు పిట్టల్లాగా రాలిపోతున్న విషయం అధికారులు వెంటనే గ్రహించారు. అయినా.. అప్పటికే పరిస్థితి విషమించింది. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు.
పారిశ్రామిక నగరం విశాఖలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయి. అందులో 2013 జనవరి 27న జరిగిన ప్రమాదం పెద్దది.
అప్పట్లో ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. హెచ్పీసీఎల్ ఎంఎస్ బ్లాక్లో సీసీఆర్ యూనిట్లో ఆ ప్రమాదం సంభవించింది. 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతకుముందు 1997లో కూడా హెచ్పీసీఎల్లోనే ప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు.
2013, 2017లో కూడా ప్రమాదాలు జరిగినప్పటికీ పెద్దగా ప్రాణనష్టం లేకుండా బయటపడ్డారు.
వాటి తర్వాత ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ ప్రమాదమే విశాఖ పారిశ్రామికప్రాంతాల్లో జరిగిన పెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు.