యార్లగడ్డపై మరోసారి వల్లభనేని వంశీ వ్యాఖ్యలు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం నాడు మరోసారి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావుకు సన్మానం చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత యార్లగడ్డను సన్మానిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ, వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్దం సాగుతోంది. యార్లగడ్డకు సన్మానం చేసి తీరుతానని వల్లభనేని వంశీ మరోసారి ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వల్లభనేని వంశీ చేసిన అక్రమాలను గురించి తాను ప్రచారం నిర్వహించినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ఓ గ్రామంలో తనకు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్నే తాను ప్రచారం చేశానని ఆయన గుర్తు చేసుకొన్నారు.
వల్లభనేని వంశీకి చెందిన మనుషులు తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.
ఈ విషయమై వంశీ ఫేస్బుక్ ద్వారా యార్లగడ్డకు వివరణ ఇచ్చారు. ఫేస్ బుక్ ద్వారా వంశీ ఇచ్చిన వివరణపై యార్లగడ్డ తీవ్రంగానే స్పందించారు. ఓటమి భయంతోనే వంశీ ఈ రకంగా వ్యవహరిస్తున్నారని వెంకట్రావు వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు వంశీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదని యార్లగడ్డ స్పష్టం చేశారు.
గురువారం నాడు మరోసారి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేస్తానని మరోసారి ప్రకటించి సంచలనం సృష్టించారు.యార్లగడ్డ వెంకట్రావుకు సన్మానం చేసి తీరుతానని ఆయన తేల్చి చెప్పారు.
యార్లగడ్డకు సన్మానం చేయాలనే తన నిర్ణయంలో మార్పు లేదన్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరినైనా కలిసే హక్కు ఉంటుందన్నారు. గన్నవరంను డల్లాస్గా మారుస్తానని చెప్పిన యార్లగడ్డ వెంకట్రావును మే 23 తర్వాత తప్పకుండా సన్మానం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.